
- లక్ష్యాలను సాధించిన ఆర్జీ– 2, మణుగూరు ఏరియాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో తొలినెల ఏప్రిల్లో బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి టార్గెట్ చేరలేదు. 52. 78 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 49.91 లక్షల టన్నులు మాత్రమే సాధించింది. ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్, మే నెలల్లో కార్మికుల బదిలీపై సంస్థ నిషేధం విధించింది. గత ఆర్థిక సంవత్సరంలో చేరకపోగా.. ఈసారి మొదటి నుంచే టార్గెట్ పై దృష్టి పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా11 ఏరియాల్లో ఆర్జీ–2 ఏరియా ( 219శాతం ), మణుగూరు ఏరియా(117శాతం) లక్ష్యాలను చేరి రికార్డు సాధించాయి.
కొత్తగూడెం ఏరియా( 93), ఇల్లెందు( 82), బెల్లంపల్లి (78), మందమర్రి (70), శ్రీరాంపూర్ (92)ఆర్జీ–1 ఏరియా( 51), ఆర్జీ–3 ఏరియా (89), అడ్రియాల (84), భూపాలపల్లి (70) శాతం ఉత్పత్తి చేశాయి. ఇదిలా ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో 54. 75 లక్షల టన్నుల కోల్ప్రొడక్షన్చేయగా ఈసారి 49. 91 లక్షల టన్నులు మాత్రమే చేయడం గమనార్హం. గతేడాది తొలి నెలతో పోలిస్తే 4.84. లక్షల టన్నులు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై సింగరేణి చైర్మన్ ఎన్. బలరాం స్పెషల్ఫోకస్పెట్టారు. ఎందుకు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామనే దానిపై డైరెక్టర్లు, జీఎంలు, ఏజెంట్లతో ఆయన మీటింగ్నిర్వహించనున్నారు.