మల్హర్, వెలుగు : ఆర్థిక సమస్యలతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు అడవుల్లో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన బత్తుల కృష్ణ చైతన్య (36) అడ్రియాల లాంగ్వాల్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఓవర్మెన్గా పనిచేస్తున్నాడు.
కృష్ణ చైతన్య కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ చైతన్య మంగళవారం రాత్రి కొయ్యూరు గ్రామ సమీపంలోని పీవీ నగర్ అటవీ ప్రాంతానికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు కృష్ణ చైతన్య తన భార్య పద్మావతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్సై మహేందర్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా, కృష్ణ చైతన్య బెట్టింగ్ లో డబ్బులు పెట్టి నష్టపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు
తెలుస్తోంది.
