సింగరేణిలో కార్మిక సంఘాలు గురువారం చేసిన సమ్మె విజయవంతం అయింది. కంపెనీ సర్వే చేసిన నాలుగు కోల్ బ్లాక్లను ప్రైవేటైజేషన్లో భాగంగా వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెతో సింగరేణిలోని 29 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్కాస్ట్ లలో బొగ్గు తవ్వుడు పూర్తిగా ఆగిపోయి.. ఒక్క పెల్ల కూడా బయటికి రాలేదు. దీంతో దాదాపు రూ.60 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తిపై దెబ్బ పడింది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ను కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులు ముట్టడించారు.
భద్రాద్రికొత్తగూడెం, మందమర్రి, గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం సమ్మె జరిగింది. సింగరేణి సర్వే చేసిన నాలుగు కోల్బ్లాక్లైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం ఓసీ –3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్ఓసీ, మందమర్రి ఏరియాలోని కళ్యాణఖని, శ్రావణపల్లి ఓసీ కోల్ బ్లాక్లను ప్రైవేటైజేషన్లో భాగంగా వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు గురు, శుక్ర, శనివారాల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ తో పాటు సింగరేణి కాలరీస్ వర్కర్స్యూనియన్(ఏఐటీయూసీ), సింగరేణి కోల్ మైన్స్కార్మిక సంఘ్(బీఎంఎస్), సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్మెస్, ఇఫ్టూ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మెతో సింగరేణిలోని 29 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్కాస్ట్ మైన్స్లో కోల్ ప్రొడక్షన్స్తంభించింది.
కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరాంపూర్, ఆర్జీ – 1,2,3 ఏరియాల్లో బొగ్గు పెల్ల బయటికి రాలేదు. సమ్మెతో దాదాపు రూ. 60 కోట్ల విలువైన కోల్ ప్రొడక్షన్కు విఘాతం కలిగింది. మొదటి షిఫ్ట్లో సింగరేణి వ్యాప్తంగా 27,559 మందికిగానూ 3,420 మంది వర్కర్స్ అటెండ్ అయ్యారు. ఇందులో 90 శాతం మంది ఎసెన్షియల్ స్టాఫే ఉన్నారు. ఇదిలా ఉండగా సింగరేణిలోని ఓపెన్కాస్ట్ మైన్స్లలో ఓవర్బర్డెన్ పనులు కొనసాగాయి. ఓవర్ బర్డెన్ పనులు చేసే కాంట్రాక్టర్లు అత్యధిక శాతం టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల కనుసన్నలలోనే పనిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ వర్కర్స్ మొదటి షిఫ్ట్లో 11,727 మందికి 5,792 మంది అటెండ్ అయ్యారు.
కొత్తగూడెంలో ఉద్రిక్తత
కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ను కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా హెడ్డాఫీస్లోకి ఆఫీసర్లు, ఉద్యోగులు పోకుండా అడ్డుకున్నారు. మీ కాళ్లు పట్టుకుంటాం, డ్యూటీలోకి వెళ్లవద్దు, సమ్మెకు మద్దతు ఇవ్వండి అంటూ నాయకులు, కార్మికులు హెడ్డాఫీస్ ఆఫీసర్లు, ఉద్యోగులను వేడుకున్నారు. మొండిగా వెళ్లేవారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్స్కాంపౌండ్వాల్దూకి దొంగచాటుగా హెడ్డాఫీస్లోకి పోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మినహాయిస్తే గత రెండు దశాబ్దాల కాలంలో హెడ్డాఫీస్లోకి మధ్యాహ్నం వరకు డ్యూటీలకు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన ఇదే కావడం గమనార్హం. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్కాస్ట్లు, అండర్గ్రౌండ్ మైన్స్లతో పాటు జీఎం ఆఫీస్ల ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
నిరవధిక సమ్మె చేస్తాం
సింగరేణికి చెందిన నాలుగు కోల్ బ్లాక్లను సింగరేణికే కేటాయించేంతవరకు అవసరమైతే కంపెనీలో నిరవధిక సమ్మె చేస్తామని కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్, సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట గురువారం చేపట్టిన ధర్నాలో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, యూనియన్సెంట్రల్ఆర్గనైజింగ్ సెక్రెటరీ వంగా వెంకట్, సీఐటీయూ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎం. సాయిబాబు, ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్జనరల్ సెక్రెటరీ మందా నర్సింహారావు, కోల్మైన్స్కార్మిక సంఘ్స్టేట్జనరల్ సెక్రెటరీ పి. మాధవ్, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ఎండి. రజాక్, హెచ్ఎమ్మెస్, ఇఫ్టూ నాయకులు రమణారావు, డి. ప్రసాద్, సంజీవ్ మాట్లాడారు. నాలుగు కోల్ బ్లాక్లను వేలం వేయడాన్ని కేంద్రం విరమించుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లాభాల బాటలో నడుస్తున్న కంపెనీలను ప్రైవేటైజేషన్చేసే కుట్రలను ఎండగట్టాలన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ సీఎండీకి సరైన సఖ్యత లేకపోవడం వల్లే కోల్బ్లాక్లను వేలం వేసే పరిస్థితి వచ్చిందన్నారు.