డబుల్ మస్టర్ ఇయ్యకుంటే డ్యూటీ చెయ్యం
సింగరేణి కార్మికుల నిరసన
నిలిచిన రూ. 1.5కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కార్మికులు శుక్రవారం డ్యూటీలకు వెళ్లకుండా నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఇల్లందులోని సింగరేణి కార్మికులకు శుక్రవారం వీక్ఆఫ్. ఆయా పరిస్థితులను బట్టి సెలవురోజున కార్మికులు పనిచేస్తే యాజమాన్యం డబుల్ మస్టర్ చెల్లించడం సర్వసాధారణం. కాగా ఈ నెల 22న ప్రధాని మోడీ దేశవ్యాప్త జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు సెలవు ప్రకటించింది. అయితే దానికి బదులు శుక్రవారం డ్యూటీ చేయాలని ఏరియా ఆఫీసర్లు కార్మికులను ఆదేశించారు. సెలవు రోజైన శుక్రవారం పనిచేస్తే డబుల్మస్టర్ ఉంటుందని ఆశగా కార్మికులు ఏరియాలోని జేకే–5 ఓసీ, కోయగూడెం ఓసీలకు వచ్చారు. డ్యూటీ చేసే క్రమంలో మస్టర్ వేయించుకునేటప్పుడు డబుల్మస్టర్ లేదని ఆఫీసర్లు చెప్పడంతో కార్మికులు అవాక్కయ్యారు. సెలవు రోజు డ్యూటీ చేస్తే డబుల్ మస్టర్ ఇవ్వాల్సిందే కదా? అని అడిగితే ఇవ్వమంటూ ఆఫీసర్లు మొండికేశారు. దీంతో ఏరియాలోని జేకే –5 ఓపెన్కాస్ట్కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో మొదటి, రెండో షిఫ్ట్లో అత్యవసర సిబ్బంది తప్ప కార్మికులు పనిచేయలేదు. మూడో షిఫ్ట్లోనూ పనిచేసేందుకు కార్మికులు రారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. దీంతో దాదాపు రూ.1.5కోట్ల విలువైన 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు నుంచి కోయగూడెం ఓసీలో అంత దూరం నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లలేక పలువురు డ్యూటీ చేశారు. జేకే–5 ఓసీలో దాదాపు 320 మంది పనిచేస్తుండగా అత్యవసర సిబ్బంది 25 నుంచి 40 మంది డ్యూటీ చేశారు.
For More News..