వరుస అగ్నిప్రమాదాలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు ..గ్రేటర్ పరిధిలో ఒకే రోజు నాలుగు చోట్ల ఘటనలు

వరుస అగ్నిప్రమాదాలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు ..గ్రేటర్ పరిధిలో ఒకే రోజు నాలుగు చోట్ల ఘటనలు

 గ్రేటర్​ పరిధిలో ఒకేరోజు వరుస అగ్ని ప్రమాదాలతో ఆయా చోట్ల స్థానికులు ఉలిక్కిపడ్డారు. సనత్ నగర్​లోని ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలగా, ఎస్​ఆర్​ నగర్​లోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌‌‌‌లో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. కాటేదార్ పారిశ్రామిక వాడలో రబ్బర్​ ఫ్యాక్టరీ కాలి బూడిదైంది. ​​మైలార్ దేవ్ పల్లి పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 

హైదరాబాద్ సిటీ, వెలుగు: సనత్​నగర్ రాజరాజేశ్వరి నగర్​లోని ఓ ఇంట్లో గురువారం ఉదయం రిఫ్రిజిరేటర్ పేలింది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో హైడ్రా, ఫైర్​టీమ్స్​ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.

క్రిష్ ఇన్ రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం

ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌‌‌‌లో గురువారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనం గ్రౌండ్​ఫ్లోర్‌‌‌‌లోని రెస్టారెంట్‌‌‌‌లో మంటలు చెలరేగగా, నిర్వాహకుల సమాచారంతో ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. ఓ మహిళకు బ్రీతింగ్ సమస్య రావడంతో ఆక్సిజన్ మాస్క్​తో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ సీహెచ్ పూర్ణ కుమార్ తెలిపారు.

పెట్రోల్ పంపులో తప్పిన పెను ప్రమాదం

 శంషాబాద్: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. షాద్  నగర్ నుంచి దిల్​సుఖ్ నగర్ వైపు వెళ్తున్న సుదర్శన్ అనే వ్యక్తి పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న క్రమంలో పెట్రోల్ పంపులోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బంక్ సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో పెట్రోల్ పంపులో కొన్ని వాహనాలు పెట్రోల్ పోయించుకుంటున్నాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రబ్బర్​ కంపెనీలో  ఎగసిపడ్డ మంటలు

రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ నగర్ లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో షార్ట్​ సర్క్యూట్​కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.