సింగోటం - గోపాల‌దిన్నె లింక్ కెనాల్ పనులు స్పీడప్ చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

సింగోటం - గోపాల‌దిన్నె లింక్ కెనాల్ పనులు స్పీడప్ చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి/వీపనగండ్ల, వెలుగు: సింగోటం-గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను స్పీడప్​ చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారంలో భూబాధిత రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ విలువను రెండింతలు పెంచి (రూ.3,75,000), దానికి భూసేకరణ చట్టం ప్రకారం మూడింతల పరిహారం,  వడ్డీ కలిపి ఎకరాకు మొత్తం రూ.11,50,000 చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

సాధారణ పట్టాదారులతో పాటు అసైన్డ్ రైతులు, సాగులో ఉన్న పేద రైతులకు కూడా 3ఆర్ కింద పూర్తి పరిహారం వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. జూరాల, భీమా ప్రాజెక్టుల పరిధిలోని 40 వేల ఎకరాల ఆయకట్టు సమస్యను పరిష్కరించడానికే 2018లో ఈ లింక్ కెనాల్ మంజూరు చేశామని, ఇందు కోసం సేకరించాల్సిన 305 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ ఎస్​ఈ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.