సెయింట్ లూయిస్ (అమెరికా): ఇండియా గ్రాండ్ మాస్టర్లు డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద.. సింక్ఫీల్డ్ కప్లో మూడో రౌండ్ గేమ్ను డ్రాగా ముగించారు. గురువారం సామ్యూల్ సెవియన్ (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ డ్రాగా ముగించాడు. నల్ల పావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్ సిసిలియన్ డిఫెన్స్తో ముందుకెళ్లాడు. రోస్లిమో వేరియేషన్తో సామ్యూల్ పావులను మార్చినా గుకేశ్కు చెక్ పెట్టలేకపోయాడు. నియంత్రణతో కూడిన ఆటతీరుతో గుకేశ్ మిడిల్ గేమ్ను కంట్రోలు చేయడంతో గేమ్ డ్రావైపు వెళ్లింది. నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద కూడా డ్రా చేసుకున్నాడు.
రెండు గేమ్లు తెల్లపావులతో ఆడిన తర్వాత తొలిసారి నల్లపావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞా నిమ్జో ఇండియన్ డిఫెన్స్ను అనుసరించాడు. నొడిర్బెక్ దీనిని పెద్దగా నిలువరించలేకపోయాడు. ఇతర గేమ్ల్లో ఫ్యాబియానో కరువాన (అమెరికా).. అలిరెజా ఫిరౌజ (ఫ్రాన్స్)పై గెలవగా, డుడా జాన్ క్రిస్టోఫ్ (పోలెండ్).. వెస్లీ సో (అమెరికా), మ్యాక్సిమ్ వాచిర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్).. లెవనో అరోనియన్ (అమెరికా) మధ్య జరిగిన గేమ్లు డ్రా అయ్యాయి. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కరువాన చెరో రెండు పాయింట్లతో టాప్–2లో ఉండగా, గుకేశ్ ఒకటిన్నర పాయింట్లతో సంయుక్తంగా మూడో ప్లేస్లో కొనసాగుతున్నాడు.

