
- 618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా?
- ట్యాపింగ్ లిస్టులో ఉన్న వారిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా?
- మావోయిస్టుల పేరుతోనే అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా చెప్పింది కదా!
- నాలుగో రోజు విచారణలో ప్రభాకర్రావుపై సిట్ ప్రశ్నల వర్షం
- 1200కు పైగా ప్రముఖుల ప్రొఫైల్స్ ముందుంచి విచారణ
- పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన ప్రభాకర్ రావు
- ఇలాగే సహకరించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో అధికారులు
- ఇయ్యాల కూడా విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మావోయిస్టుల పేరుతో ట్యాపింగ్ లిస్ట్ తయారు చేసిన కుట్రను బయటపెట్టేందుకు ప్రభాకర్రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. పొలిటికల్ లీడర్లు సహా 618 మందిని మావోయిస్టులుగా ఎందుకు చూపాల్సి వచ్చిందని, ఒకవేళ వాళ్లు మావోయిస్టులే అయితే అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలేంటని ప్రశ్నించింది. సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన లిస్టులో ఉన్న వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆయా నంబర్లు మావోయిస్టు సానుభూతిపరులకు చెందినవిగానే తమ వద్ద అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా స్పష్టం చేసిందని ప్రభాకర్రావుకు సిట్ అధికారులు వివరించారు. విచారణలో భాగంగా ప్రభాకర్ రావు గురువారం ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరయ్యారు.
వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని బృందం ఆయనను ప్రశ్నించింది. రాత్రి 8 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు విచారించారు. అమెరికా నుంచి వచ్చిన తరువాత మూడు రోజుల విచారణలో ప్రభాకర్ రావు నుంచి సేకరించిన సమాచారంతో పాటు ప్రణీత్రావు, సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ఆధారంగా ప్రశ్నించారు. మళ్లీ శుక్రవారం హాజరుకావాలని ఆదేశించారు.
ఫోన్ నెంబర్లు ముందుంచి..
మావోయిస్టుల పేర్లతో తయారు చేసిన లిస్టును ముందుంచి సిట్ అధికారులు ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రభాకర్ రావు నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలిసింది. కొన్ని ఫోన్నంబర్లు చూపి, ఎవరివో చెప్పాలని కోరగా తనకు తెలియదన్నట్లు సమాచారం. కాగా, లిస్టులో ఉన్న నంబర్లకు సిట్ అధికారులు ఫోన్చేసి వారి వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో మీ నంబర్ ఉంది అని చెప్పి సాక్షులుగా విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభాకర్ రావును లిస్టు గురించి ఆరా తీస్తున్నారు. ఎవరి సూచనల మేరకు సామాన్యుల నంబర్లను మావోయిస్టుల పేర్లతో ట్యాపింగ్ చేయించారని ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రణీత్రావు స్టేట్మెంట్లో పేర్కొన్న విధంగా మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలనే ధ్యేయంతోనే ఎస్ఐబీ కేంద్రంగా ‘ఆపరేషన్ టార్గెట్స్’ నిర్వహించారా..? అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.ఈక్రమంలోనే ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల్ని, వారి అనుచరుల్ని ఎందుకు టార్గెట్చేశారు? వాళ్ల ఫోన్ నంబర్లను ఎలా సేకరించారు? ఆయా ఫోన్నంబర్లు మావోయిస్టులవే అనేందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? లాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు యత్నించినట్లు తెలిసింది.
కాల్డేటా ముందుంచి ప్రశ్నలు..
సీఎంవో నుంచి ప్రభాకర్ రావుకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేసిన ప్రభాకర్ రావుకు.. ఆయన కాల్ డేటాను ముందుంచి ప్రశ్నించినట్టు తెలిసింది. సాక్షులు చెప్పిన వివరాలతో పాటు ట్యాపింగ్ జరిగిన సమయాల్లో ప్రభాకర్ రావు, ప్రణీత్రావు, భుజంగరావు మధ్య ఫోన్ సంభాషణల గురించి ఆరా తీసినట్లు సమాచారం. 1,200 మంది ప్రముఖుల ప్రొఫైల్స్పై తయారు చేయడానికి గల కారణాలు ఏమిటని అడిగినట్లు తెలిసింది. ఆపరేషన్స్ కోసం ప్రణీత్ రావు వినియోగించిన 8 ఫోన్ నంబర్ల గురించి ఆరా తీశారు. ఆయా నంబర్లకు సంబంధించిన కాల్డేటా తమ వద్ద ఉందని తెలిపారు.ఈ క్రమంలోనే ప్రణీత్రావు తయారు చేసిన1,200కు పైగా ప్రముఖుల ప్రొఫైల్స్ను ప్రభాకర్ రావు ముందుంచినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్తో పాటు మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిపిన దాడులు, పట్టుకున్న డబ్బుకు సంబంధించి తమ దగ్గరున్న ఆధారాలను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో శుక్రవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదే విధంగా విచారణకు సహకరించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అరెస్ట్ చేసి కస్టడీలో విచారించేందుకు అనుమతి కోరనున్నట్లు తెలిసింది.