
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్టేట్ మెంట్ తీసుకున్నారు సిట్ అధికారులు. కాలి గాయంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘునందన్ రావు దగ్గరకు వెళ్లిన సిట్ అధికారులు ఆయన స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు.
జూన్ 27న మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్ లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను సిట్ విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు రఘునందన్ రావు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు రఘునందన్ రావు స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో జూన్ 26న తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది. రఘునందన్ టూర్లలో ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.