
తిరుమల కల్తీ నెయ్యిపై సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన సిట్ శుక్రవారం ( జూన్ 26 ) నివేదికను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేసు దర్యాప్తు తేలిన అంశాలను పొందు పరిచిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది సిట్. దీంతో పాటు నిందితుల పిటిషన్ల పురోగతిని కూడా నివేదికలో వివరించినట్లు తెలిపింది సిట్. సిట్ సమర్పించిన నివేదికపై త్వరలో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు.
సిట్ నివేదికలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారని తేలితే.. సుప్రీంకోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని తేలితే మాత్రం ప్రతిపక్ష వైసీపీకి ఊరట లభించడమే కాకుండా.. కూటమి సర్కార్ ను విమర్శించేందుకు మరో అస్త్రం దొరికిణ్ణట్లే అవుతుందని చెప్పాలి. ఈ క్రమంలో సుప్రీంకు సిట్ సమర్పించిన నివేదిక కీలకంగా మారింది.
తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా టీటీడీ సహా దేశంలోని పలు ఆలయాలకు ఇదే కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు సిట్ గుర్తించిందని తెలుస్తోంది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డైరీకి నెయ్యి సరఫరా ద్వారా సుమారు 240 కోట్లకు పైగా లబ్ది జరిగినట్లు సిట్ గుర్తించింది. మొత్తానికి గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు యేమని తీర్పు వెల్లడిస్తుందో వేచి చూడాలి.