
- కేసును సీబీఐకి బదిలీ చేయాలి
- హైకోర్టును కోరిన బీజేపీ లాయర్లు
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేసిందన్న సిట్ వాదనను బీజేపీ తప్పుబట్టింది. 104 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, ముగ్గురు నలుగురు పార్టీ మారితే ప్రభుత్వం ఎలా పడిపోతుందని నిలదీసింది. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ముందుకు నడిపిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ కనుసన్నల్లోనే సిట్తో దర్యాప్తు జరుగుతోందని వాదించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వద్దని, సీబీఐతో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జి.ప్రేమేందర్రెడ్డి, కేసులోని ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, ఇతరులు వేసిన రిట్లపై బుధవారం జస్టిస్విజయ్సేన్రెడ్డి విచారణ జరిపారు.
నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మహేశ్ జఠ్మలానీ వాదిస్తూ.. ముగ్గురు నిందితులకు ఏ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. నేరారోపణలకు ఆధారా ల్లేవని, ఇక్కడ వర్తించే విధంగా లేవన్నారు. ఎమ్మెల్యేలను ఎందుకు కొనేందుకు ప్రయత్నించారో కూడా చెప్పలేదన్నారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి నలుగురు బయటకు వస్తే ప్రభుత్వం ఎలా కూలిపోతుందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలరని అడిగారు. కాబట్టి ముగ్గురిపై పెట్టిన కేసులకు చట్టబద్ధత లేదన్నారు.
సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలి
బీజేపీని లక్ష్యంగా చేసుకుని సిట్ దర్యాప్తు చేస్తోందని బీజేపీ తరఫు లాయర్ వాదించారు. సీజేఐ, హైకోర్టు సీజేలకు సీఎం సీడీలు, పెన్డ్రైవ్లు పంపడాన్ని బట్టి కేసులో ప్రభుత్వ ఉద్దేశం కనబడుతోందన్నారు. వెంటనే ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదన్నారు. సిట్ తరఫు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదిస్తూ, సిట్ దర్యాప్తు బాగా జరుగుతోందని, ఎంతోమందికి లింక్స్ ఉన్నాయని, సిట్ నుంచి సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మిగిలిన అన్ని కేసుల విచారణ 6కు వాయిదా పడింది.