ఆడుకుంటున్న చిన్నారులపై బోల్తాపడ్డ ట్రక్కు.. ఆరుగురు మృతి

ఆడుకుంటున్న చిన్నారులపై బోల్తాపడ్డ ట్రక్కు.. ఆరుగురు మృతి

గోపాల్‌గంజ్: బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్నపిల్లలపై ఓవర్‌లోడ్ తో వెళుతున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో ఆరుగురు మైనర్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని సరేయా నరేంద్రలో ఈ దారుణం జరిగింది. చిన్నారులు రోడ్డు పక్కన ఆడుకునే సమయంలో భారీలోడుతో అటుగా వెళుతున్న ట్రక్కు వారిపై పడింది. రెప్పపాటు సెకనులో ఆ పిల్లల శరీరాలు  నుజ్జనుజ్జయ్యాయి. వారంతా 8 నుంచి 15 ఏళ్ల లోపువారే. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని,  ట్రక్కు కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.