నాలుగు వారాల పాటు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడవు: స్కైమెట్​ అంచనా

నాలుగు వారాల పాటు ఆ ప్రాంతాల్లో వర్షాలు పడవు: స్కైమెట్​ అంచనా

కేరళను నైరుతి రుతుపవనాలు తాకినా.. నాలుగు వారాల పాటు దాని ప్రభావం ఇండియాలో తక్కువే ఉంటుందని స్కైమెట్​ వెదర్​ అనే సంస్థ వెల్లడించింది. తద్వారా వ్యవసాయ రంగంపై ఆధారపడే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలిపింది. ఎక్స్​టెండెడ్​ రేంజ్​ ప్రిడిక్షన్​ సిస్టం ప్రకారం.. జూలై 6 వరకు వర్షాలు పడే సూచన అంతగా లేదు.  వర్షాధార పంటలు వేసే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

రుతుపవనాలతో రావాల్సిన వర్షాలు ఆలస్యం అవుతున్నాయని, దీంతో వ్యవసాయదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు స్కైమెట్​ తెలిపింది. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల  ఇబ్బందులు ఎదుర్కోవచ్చని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో వానలు సరిగ్గా పడవని అంచనా వేసింది.

బిపర్​జోయ్​ తుఫాన్​ప్రభావం..

సాధారణంగా జూన్​1 న రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్​ 8న కేరళను తాకాయి.  అదే సమయంలో గుజరాత్​ తీరంలో ఏర్పడిన బిపర్​జోయ్​తుపాన్​వల్ల రుతుపవనాలు ఆలస్యంగా రావడమే కాకుండా చురుగ్గా కదలక, మందగమనాన్ని ప్రదర్శిస్తున్నాయి.  ఇదే పరిస్థితి కొనసాగితే మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్​ఘట్, జార్ఖండ్​, బిహార్​రాష్ట్రాలను జూన్​ 15 వరకు కూడా నైరుతి చేరుకోవడం కష్టమేనంటోంది స్కైమెట్. కొంగొత్త ఆశలు రేపుతున్న ఈ వర్షాకాలం రైతులను కనికరిస్తుందో లేదో చూడాలి.