
జపాన్.. అనగానే పంక్చువాలిటీ గుర్తొస్తుంది. కానీ, ఆ పంక్చువాలిటీ మిస్సైంది. టైంకొచ్చే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. డజన్ల సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. 12 వేల మంది ప్రయాణికులకు ఇబ్బందులొచ్చాయి. దానికంతటికీ కారణం, ఒక్క నత్త. అవును, నత్తే. మే 30న జరిగిన ఈ ఘటనను తాజాగా రైల్వే అధికారులు బయటపెట్టారు.
ఇంతకీ, నత్త ఎలా కారణమంటారా? రైల్వే ట్రాక్ పక్కనున్న కరెంట్ ఇన్స్టాలేషన్లోకి ఆ నత్త వెళ్లిందట. దీంతో అది చచ్చిపోవడంతో పాటు కరెంట్ సరఫరాలో ఇబ్బందులొచ్చాయట. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయట. క్యుషు రైల్వే కంపెనీ అలియాస్ జేఆర్ క్యుషుకు చెందిన 26 రైళ్లపై దాని ప్రభావం పడిందట. అయితే, ముందు దానికి కారణమేంటో అధికారులు గుర్తించలేకపోయారు. పవర్ గ్రిడ్లోకి నత్త వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇలా జరిగిందని తాజాగా తేల్చారు.