- జనసమీకరణలో లోకల్ లీడర్స్ బిజీ
- ఫోన్ పే, గూగుల్ పేతో పేమెంట్లు.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై పోలీస్ నిఘా
హైదరాబాద్, వెలుగు: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు టెక్నా లజీని ఉపయోగించుకుంటున్నారు. క్యాష్ జోలికి వెళ్లకుండా ఆన్లైన్ పేమెంట్స్తో పనులు చక్కబెట్టేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్, పోలీసులకు చిక్కకుండా తక్కువ టైమ్లో.. ఎక్కువ మందికి ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రతి అభ్యర్థీ స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలాంటి వారిపై ఇంటెలిజెన్స్, ఎస్బీ స్పెషల్ టీమ్స్ నిఘా పెట్టాయి. ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల వివరాలు సేకరిస్తున్నాయి. పూర్తి ఆధారాలతో ఎన్నికల కమిషన్కు నివేదిక ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆన్లైన్ పేమెంట్లు చేసేందుకు మండలం, గ్రామం, కాలనీల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులు క్యాష్ కో ఆర్డినేటర్స్ను నియమించుకున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహించే సభలు, సమావేశాలకు ఓటర్లను తరలిస్తున్నారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి లీడర్లు చైన్ సిస్టమ్తో పనిచేస్తున్నారు. వీరంతా ఓటర్లతో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతున్నారు. సభలు, సమావేశాలకు వస్తున్న కార్యకర్తలకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పేమెంట్స్ చేసేస్తున్నారు.
ఒక్కో ఏజెంట్కు వంద మంది బాధ్యత
లక్ష రూపాయలకు మించకుండా.. క్యాష్ కో ఆర్డినేటర్స్ ద్వారా ఏజెంట్స్ నెట్వర్క్కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఒక్కో ఏజెంట్ దాదాపు వంద మందికి పైగా ఓటర్లను గ్యాదర్ చేస్తున్నాడు. వాళ్లను సభకు తరలించేందుకు కార్లు, మీల్స్ ఏర్పాటు చేస్తున్నాడు. సభ కంప్లీట్ అయ్యాక ఇంటికి చేరే సమయానికి ఆన్లైన్ పేమెంట్లు చేసేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ లేనివారికి క్యాష్ ఇచ్చేస్తున్నాడు. ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలింగ్ ముగిసే టైమ్కి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టి.. సమాచారం సేకరిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.