- ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు వస్తున్న హెరాయిన్.. అక్కడి నుంచి రైలులో తెలంగాణకు..
- ఏవోబీ నుంచి ఏపీ మీదుగా గంజాయి, హాష్ ఆయిల్ రవాణా
- ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పలు స్టేషన్లలో దిగుతూ సప్లై
- భువనగిరిలో వలస కార్మికుడి నుంచి హెరాయిన్ స్వాధీనం
యాదాద్రి/జనగామ, వెలుగు : గతంలో పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన హెరాయిన్ డ్రగ్ ఇప్పుడు రూరల్ ఏరియాలకు సైతం సప్లై అవుతోంది. ఈ డ్రగ్తో పాటు గంజాయి, హాష్ హాయిల్ వంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా రవాణా అవుతున్నాయి. వీటిని తీసుకొచ్చేందుకు అక్రమార్కులు కొన్ని ప్రత్యేక రైళ్లను ఎంచుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ రైళ్లకు తక్కువ హాల్టింగ్లు ఉండడంతో పాటు పోలీసులు తనిఖీ చేసేందుకు తగినంత సమయం ఉండకపోవడంతో అక్రమార్కుల పని ఈజీ అవుతోంది. ఆ రైళ్ల ద్వారా యాదాద్రి, జనగామ జిల్లాల్లోని పలు పట్టణాలకు చేరుకొని.. అక్కడి నుంచి హైదరాబాద్తో పాటు, పలు రూరల్ ఏరియాలకు తీసుకెళ్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న హెరాయిన్
గంజాయిని అరికట్టడంలో భాగంగా యాదాద్రి జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నివాసాలపై దాడి చేశారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద చిన్న చిన్న ప్యాకెట్లలో ఉన్న హెరాయిన్ దొరికింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఎంక్వైరీ చేయగా.. హీరోయిన్గా పిలిచే ఈ హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు వస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించే వ్యక్తులు హెరాయిన్ను తీసుకొని సరిహద్దు ప్రాంతమైన మాల్దాలోకి అడుగు పెడుతున్నట్లు తేలింది. తర్వాత పశ్చిమబెంగాల్లో ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఒడిశా, ఏపీ మీదుగా తెలంగాణలోకి వస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగామ, ఆలేరు, భువనగిరి స్టేషన్లలో ఏదో ఒక చోట దిగి.. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్కు చేరుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఏవోబీ నుంచి గంజాయి...
స్మగ్లర్ల పరిభాషలో ‘గ్రాస్’గా పిలుచుకునే గంజాయితో పాటు దాని నుంచి హాష్ ఆయిల్, ఛరాస్ పేస్ట్ ఆంధ్రా, ఒడిశా బార్డర్ నుంచి రైలు మార్గం ద్వారా యాదాద్రి జిల్లా మీదుగా హైదరాబాద్కు తరలిపోతోంది. గతంలో విజయవాడ హైవే, వరంగల్ హైవేల్లో రవాణా జరిగేది. కానీ ఆయా రూట్లలో ఎక్సైజ్, సివిల్ పోలీసుల తనిఖీలు పెరగడంతో అక్రమార్కులు రైలు మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గంజాయి రవాణా.. ఒడిశా నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా ముంబైకి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా జరుగుతోంది. నాలుగు రాష్ట్రాల మీదుగా 1,950 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైలుకు ఎక్కువగా స్టాప్లు లేకపోవడంతో తనిఖీలు పెద్దగా జరగడం లేదు. పైగా స్మగ్లర్లు రద్దీగా జనరల్ బోగీల్లో గానీ, ఏసీ బోగీల్లో ప్రయాణం చేస్తున్నారు. జనరల్ బోగీల్లో రద్దీ ఎక్కువ ఉండడం, ఏసీ బోగీల్లో ప్రత్యేక బ్లాక్ల వారీగా ఉండడంతో పోలీసులు అంతగా తనిఖీలు చేయలేకపోతున్నారు. అలాగే రైళ్లకు ఎక్కువ స్టాప్లు లేకపోవడం, రైలు ఆగిన స్టేషన్లో పోలీసులు ఎక్కి తనిఖీలకు సిద్ధపడేలోగానే మరో స్టాప్ రావడంతో దిగిపోతున్నారు. దీంతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం సాధ్యం కావడం లేదు.
రూరల్ ఏరియాల్లో అమ్మకాలు
డ్రగ్స్, గంజాయిని సరఫరా చేస్తున్న వారిలో కొందరు హైదరాబాద్కు వెళ్తుండగా, మరికొందరు ఆర్టీసీ బస్సుల ద్వారా రూరల్ ప్రాంతాలకు చేరుకొని అమ్మకాలు చేస్తున్నారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండకపోవడంతో వీళ్ల పని ఈజీ అవుతోంది. అది కూడా ఎక్కువగా మధ్య తరగతికి చెందిన యువతనే టార్గెట్గా చేసుకొని విక్రయాలు చేస్తున్నారు.
రైళ్లలోనూ తనిఖీలు చేస్తున్నాం
పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి హైదరాబాద్కు వచ్చే రైళ్లనూ తనిఖీ చేస్తున్నాం. కానీ ఈ రైళ్లు తక్కువ స్టేషన్లలో ఆగుతుండడం, సమయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నాం. హెరాయిన్, గంజాయి వంటివి తెచ్చే వాళ్లు సరుకు ఒక చోట పెట్టి.. మరో చోట కూర్చుంటున్నారు. కొందరైతే ఏసీ కోచ్ల్లోనూ ప్రయాణిస్తున్నారు.
- విష్ణుమూర్తి, ఎక్సైజ్ ఎస్పీ, యాదాద్రి జిల్లా
యాదాద్రి జిల్లా భువనగిరిలో వలస కార్మికులు ఉంటున్న ఓ ప్రాంతంపై ఇటీవల ఎక్సైజ్ పోలీసులు దాడి చేయగా.. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ కార్మికుడి వద్ద చిన్న చిన్న ప్యాకెట్లలో హెరాయిన్ దొరికింది. దీంతో పాటు 0.01 గ్రాములను తూకం వేసే డిజిటల్ వేయింగ్ మెషీన్ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని బరంపురంలో ఓ వ్యక్తి వద్ద హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఐదు కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. కాజీపేట వరకు ట్రైన్లో వచ్చిన వీరు.. అక్కడి నుంచి బస్సులో జనగామ చేరుకున్నారు. అక్కడ మరో బస్సు ఎక్కేందుకు ప్రయత్నం చేస్తుండగా.. జనగామ పోలీసులు ఇద్దరిని పట్టుకోగా, మరో వ్యక్తి పరార్ అయ్యాడు.
ఏపీలోని నర్సీపట్నం మండలం గబ్బెడకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశాలో నాలుగు లీటర్ల హాష్ ఆయిల్ కొనుగోలు చేసి ట్రైన్లో భువనగిరి వరకు వచ్చారు. అక్కడ మరో ఎక్కేందుకు ప్రయత్నిస్తూ భువనగిరి పోలీసులకు పట్టుబడ్డారు.
