8 మంది అరెస్ట్.. మరొక నిందితుడి కోసం గాలింపు
300 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయి స్మగ్లింగ్
హైదరాబాద్, వెలుగు: డీసీఎం నిండా ‘సరుకు’.. ఆ సరుకు ఎవరి కంటా పడకుండా డీసీఎం ముందూ వెనకా రెండు పైలట్వెహికల్స్తో కట్టుదిట్టమైన రవాణా! ఇంత పకడ్బందీగా తీసుకెళ్తున్నారంటే.. అందులో ఉన్నది ఏ బంగారమో.. డబ్బో అనుకునేరు. కానే కాదు. కిలోల కొద్దీ గంజాయి. పోలీసులకు దొరకకుండా కొందరు స్మగ్లర్లు పన్నిన ప్లాన్ ఇది. చేసేదేం మంచి పని కాదు కదా.. పోలీసులకు దొరికిపోయారు. కటకటాలు లెక్కపెడుతున్నారు. ఎస్కార్ట్ వెహికల్స్తో విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.65 వేల క్యాష్, 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ రూ.83.6 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న ఏజెంట్ కోసం గాలిస్తున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్భగవత్ శనివారం వెల్లడించారు.
3 వేలకు కొని.. 10 వేలకు అమ్మకం
విశాఖపట్నంలోని బుచ్చయ్యపేటకు చెందిన పతల నగేశ్(23) వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఏజెన్సీ ఏరియాలో తక్కువ ధరకు దొరికే గంజాయిని స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. హైదరాబాద్, జహీరాబాద్, మహారాష్ట్ర బార్డర్లలో ఏజెంట్లను నియమించుకున్నాడు. హైదరాబాద్లోని జవహర్నగర్తో పాటు సిటీ శివార్లలో షెల్టర్లూ ఏర్పాటు చేసుకున్నాడు. ఏజెంట్ల ద్వారా ఆర్డర్లు తీసుకుని.. జహీరాబాద్కు చెందిన ఏజెంట్ కార్తీక్ రాథోడ్ ద్వారా గంజాయిని తరలించేవాడు. ఏజెన్సీ ఏరియాలో కిలో గంజాయిని రూ.3 వేలకు కొని.. మహారాష్ట్రలోని కస్టమర్లకు రూ.10 వేల చొప్పున అమ్మేవాడు. ఈ క్రమంలో చాలాసార్లు పోలీసులకు దొరికిపోయాడు. నిరుడు జహీరాబాద్లో నమోదైన కేసులో నగేశ్ వాంటెడ్ నేరస్థుడిగా ఉన్నాడు. అయినా తీరు మార్చుకోని అతడు.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు.
పోలీసులు కనిపిస్తే అలర్ట్
గంజాయి స్మగ్లింగ్ కోసం మొగ్గ హరి (27), రవడ వెంకట కిషోర్ రెడ్డి (30), గుడ్డేటి కన్నమ నాయుడు (27), గంజి తేజ (22), మగ్గి చక్రవర్తి (31), గురుగొల్లి అప్పల రెడ్డి (28), పసుపునేటి శివాజీ (27)తో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. కార్తీక్ రాథోడ్ ఆర్డర్తో ఒక్కో ప్యాకెట్లో రెండున్నర కిలోల చొప్పున 300 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయిని డీసీఎంలో ఎక్కించాడు. ఆ డీసీఎంకు ముందు ఓ కారులో ముగ్గురు, వెనుక కారులో మరో ముగ్గురిని ఎస్కార్ట్గా పంపాడు. దారిలో ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే వెంటనే డీసీఎంలోని వ్యక్తులను అలర్ట్ చేసి దారి మళ్లించేలా పథకం వేశారు. అయితే, ఏపీలోని జి.మాడుగుల నుంచి గంజాయిని తరలిస్తున్నారని రాచకొండ ఎస్వోటీ, హయత్నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెద్ద అంబర్పేట దగ్గర చెకింగ్ చేస్తుండగా.. డీసీఎం వ్యాన్లో గంజాయిని గుర్తించారు. నిందితులను అరెస్టు చేశారు. జహీరాబాద్కు చెందిన కార్తీక్ రాథోడ్ కోసం గాలిస్తున్నారు.