
రాజ్యం, స్వరాజ్యం, ధర్మం, స్వధర్మం అనే మాటలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వినిపిస్తున్నాయి. అనగా ఈ వాక్యాలు ప్రత్యేక సాంస్కృతిక జీవనం కలిగి అణచివేతకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటాను అడుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు, నిధులు, నియామకాలు కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. స్వరాష్ట్రం, భౌగోళిక తెలంగాణ సిద్ధించింది.
తెలంగాణ సిద్ధించి 13 సంవత్సరాలు దాటినప్పటికీ అట్టడుగువర్గాల జీవితాలలో ఆశించిన మార్పురాలేదు. అనగా ఈ భూమి, సంపద, రాజ్యంలో పేదలకు వాటా రాలేదు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతి అంతంతమాత్రమే. మెజారిటీ వర్గంగా చలామణి అవుతున్న ఈ ప్రజలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు అందడం లేదు. మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఈ వర్గాలకు న్యాయం జరగడం లేదు.
మూలవాసులుగా ఈ దేశాన్ని పరిపాలించారని చరిత్ర చెబుతుంది. నేడు ఆధిపత్య వర్గాల చేతిలో పరోక్ష బానిసత్వాన్ని అనుభవిస్తూ రాజకీయ చైతన్యం లేక జడపదార్థంగా మిగిలిపోయారు. నిజాం, దొరల, రెడ్ల పాలనలో కొనసాగిన తెలంగాణలో మెజార్టీ ప్రజల్లో రాజకీయ స్పృహ కొరవడి అత్యంత పేదరికంతో అణచివేతకు గురయ్యారు.
ఇక్కడ ఇప్పటికీ ఆధిపత్య వర్గాలే రాజకీయాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఒక వర్గంపోతే మరొక వర్గం రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో మార్చి 31, 2025న తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఏర్పడింది. ఇది ఈ వర్గాల హక్కులు, రాజ్యాధికారం కోసం ఏర్పడ్డ వేదిక. తెలంగాణ ఉద్యమం సమయంలో స్వరాష్ట్ర సాధన కోసం జేఏసీ ఏర్పడగా... ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులు, స్వరాజ్యం కోసం మరో జేఏసీ ఏర్పాటైంది. దీని కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మరో విముక్తి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇది ఒక చారిత్రక సందర్భంగా గుర్తించవచ్చు.
ఇంకా దోపిడీ కొనసాగుతోంది
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 90 శాతం అత్యధిక బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం తెలంగాణ. అలాంటి ప్రజలు అత్యంత దోపిడీకి గురైంది కూడా ఈ తెలంగాణ ప్రాంతంలోనే. దేశంలోనే ఎక్కడా లేనంత ‘అగ్రకుల వ్యవస్థ, పట్వారి భూస్వామ్య వ్యవస్థ’ ఉన్నది కూడా ఇక్కడే. ఈ అగ్రకుల జనాభా మొత్తం కలిపితే 10 శాతం. కానీ, అగ్రకులాలు 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను బానిసలుగా మార్చుకున్నారు.
తరతరాలుగా దోపిడీ కొనసాగుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో సైతం అగ్రకుల కుట్రలకు బడుగు, బలహీన వర్గాలు బలిపశువులయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలనే ఎజెండాతో ప్రజలను భావోద్వేగాలతో రెచ్చగొట్టారు. కానీ అగ్రకుల ఆంధ్రవాళ్ళ స్థానంలో తెలంగాణ అగ్రకులాలు పాలించడమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందనేది ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఈ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో తెలంగాణవాదం అనే భావోద్వేగ పోరాటంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వర్గాలు బలిపశువులు కాకతప్పలేదు. మరోవైపు ఉద్యమంలో అమరులైన అమాయక ప్రజలను త్యాగం, వీరత్వం పేరుతో అగ్రకులాలు రెచ్చగొడుతూ రాజకీయంగా వాడుకున్నారు. చివరికి తెలంగాణ సిద్ధించినప్పటికీ భౌగోళిక మార్పే జరిగింది, కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవన ముఖచిత్రంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
రాజ్యాంగ ఆయుధాలతో యుద్ధం
భారతదేశంలో స్వాతంత్ర్యం అనంతరం దోపిడీకి వ్యతిరేకంగా వచ్చిన అనేక ఉద్యమాలకు, పార్టీలకు అగ్రకులాలవారే తిరిగి మళ్లీ నాయకత్వం వహించారు. ఎన్ని ఉద్యమాలు వచ్చినా చివరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల బానిస సంకెళ్లను తెంపింది భారత రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగం చూపిన రాజ్యం నిర్మించటానికీ .. అదే రాజ్యాంగం ద్వారా బాగుపడ్డవారు... తమ పీడిత జాతుల ఉన్నతికోసం నాయకత్వం వహించాలి.
అదే రాజ్యాంగ ఆయుధాలతో యుద్ధం చేస్తేనే ఈ తెలంగాణలో బానిసలకు విముక్తి వస్తుంది. అందుకోసం ఈ తెలంగాణలోని సమస్త సబ్బండ వర్గాలైన 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ బలగాన్ని ‘ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం’ దారిలో నడిపించాలి. అందుకోసమే జాక్ అధ్వర్యంలో లక్ష కిలో మీటర్ల రథయాత్ర కొనసాగుతుంది. తెలంగాణ అంతటా మూడు సంవత్సరాల మూడు నెలలు, ఒక 1 లక్ష కిలోమీటర్ల రథయాత్ర.. అంతర్లీనంగా 10,000 కిలో మీటర్ల పాదయాత్రను అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14, 2025న ఆదిలాబాద్ పట్టణంలో ప్రారంభమైంది. ఇది జులై 11, 2028 వరకు కొనసాగుతుంది.
ప్రజా సమస్యలపై పోరాటం
ఈ యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక, రాజకీయ జీవితాలలో పెనుమార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ యాత్రలో జాక్ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ప్రభుత్వ సంస్థలైన హాస్పిటల్, స్కూల్స్, హాస్టల్స్ సమస్యలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ ఆఫీసులను సందర్శిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా సామాన్య ప్రజల కష్టాలు, కన్నీళ్లను చూస్తున్నాడు. ప్రస్తుతం అగ్రకుల నాయకులు మీడియాలో రాజకీయ యుద్ధం చేస్తుంటే, విశారదన్ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలతో రాజకీయ యుద్ధం చేస్తున్నాడు.
ఇప్పుడు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వారి పేదరికం, దుర్భర జీవితం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మన ప్రజలకు చెందాల్సిన, రావల్సిన హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాల్సిన బాధ్యత జాక్ పై ఉంది. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను నిలదీస్తూ, పోరాటం చేస్తూ ప్రజలకు రాజ్యాధికార లక్ష్యంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ లను సిద్ధాంత పునాదిగా సంఘటిత పరుస్తూ...వారిలో ఒక చైతన్యాగ్నిని రగిలించడానికి లక్ష కిలోమీటర్ల రథయాత్ర కొనసాగుతోంది. ఈ మహా పోరాటంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ భాగస్వాములు కావాలి. పీడిత జాతి బిడ్డల భవిష్యత్తు కోసం కదలాలి. అప్పుడే అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయి.
రాజకీయ చైతన్య యాత్ర
రెండేళ్ల క్రితం డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకొని పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర పేరుతో రాజకీయ చైతన్య యాత్ర చేశారు. గడపగడపకూ ఆత్మ గౌరవాన్ని నింపి.. ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం భావజాలాన్ని పరిచయం చేశాడు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఖడ్గంతో రాజ్యాధికార యుద్ధం చేశాడు. నేడు మనమంతా రాజ్యాంగం కల్పించిన హక్కులతో విలాస జీవితాలు అనుభవిస్తున్నాం తప్ప అంబేద్కర్, భారత రాజ్యాంగం చూపిన విముక్తి రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాం. దీంతో అన్ని రంగాలలో ఇంకా అగ్రకుల ఆధిపత్యమే కొనసాగుతోంది.
దేశంలో 90శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ఉన్నప్పటికీ... 10 శాతం లేని అగ్రకులాలు వారి జనాభాకు మించి విద్య , ఉద్యోగాలలో 10శాతం ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్స్ కల్పించుకున్నాయి. ఈ అన్యాయాన్ని గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఓ సభలో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ లేవనెత్తారు.
–- సంపతి రమేష్ మహారాజ్,సోషల్ ఎనలిస్ట్–