- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పత్రిక స్వేచ్ఛ, విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కాచిగూడలోని స్టేట్ టీచర్స్ యూనియన్ భవన్ లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్టీయూ సంఘంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఇదిలా ఉండగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. పర్వత్ రెడ్డి, జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ.. పే రివిజన్ కమిటీ తన నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి వెంటనే అందించాలని కోరారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ, ప్రభుత్వాన్ని ఒప్పించి, ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేయడంలో తమ సంఘం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సంఘం నాయకులు ఆట సదయ్య, జుట్టు గజేందర్, సుధాకర్, ప్రసాద్, పోల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ మతంగి, అజర్ జహా, శీతల్ చౌహాన్ పాల్గొన్నారు.
