Cyber Crime: సాఫ్ట్వేర్ఉద్యోగం పేరుతో మోసపోయిన ఓ యువకుడు రూ.3.25 లక్షలు పోగొట్టుకున్న ఘటన గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మియాపూర్ ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీరామ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పబ్లిసిస్ సేపియంట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని అఖిల్ అనే వ్యక్తి అతన్ని నమ్మబలికాడు. ముందుగా ఇంటర్వ్యూ మెయిల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆపై నకిలీ ఆఫర్ లెటర్ను శ్రీరామ్కు పంపించాడు. ఉద్యోగంలో చేరే ముందు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఖర్చుల పేరుతో రూ.3.25 లక్షలు వసూలు చేశాడు. ఈ నెల 20న శ్రీరామ్ అసలైన కంపెనీ కార్యాలయానికి వెళ్లి ఆఫర్ లెటర్ను చూపించగా.. తాము ఎలాంటి లెటర్ఇవ్వలేదని నిర్వాహకులు చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
