ఐటీ కారిడార్‌‌‌‌లో బిల్డింగ్‌‌ పైనుంచి దూకి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ సూసైడ్‌‌

 ఐటీ కారిడార్‌‌‌‌లో బిల్డింగ్‌‌ పైనుంచి దూకి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ సూసైడ్‌‌

గచ్చిబౌలి, వెలుగు: తాను పనిచేస్తున్న కంపెనీ బిల్డింగ్ పైనుంచి దూకి ఓ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా తిరువీధి గ్రామానికి చెందిన వి.అవినాశ్(40) సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి. భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి బెంగుళూరులో నివాసం ఉండే అతను.. రెండు నెలల కింద హైదరాబాద్‌‌కు షిఫ్ట్‌‌ అయ్యాడు. కూకట్‌‌పల్లిలో ఉంటూ నాలెడ్జ్​ సిటీలోని క్వాల్​కమ్‌‌ బిల్డింగ్‌‌లోని హెచ్‌‌సీఎల్‌‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

 మంగళవారం సాయంత్రం అవినాశ్‌‌ ఇంటికి వస్తున్నట్లు భార్య జ్యోతికి మెసేజ్‌‌ పెట్టాడు. చాలాసేపయినా రాకపోవడంతో అతనికి ఫోన్‌‌ చేసింది. రెస్పాండ్ కాకపోవడంతో అవినాశ్ మేనేజర్‌‌‌‌కు కాల్‌‌ చేయగా... 6 గంటలకే కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఆందోళన చెందిన ఆమె తన సోదరుడు అరుణ్‌‌కుమార్‌‌‌‌కు చెప్పింది. వెంటనే అతను అవినాశ్‌‌ పనిచేస్తున్న క్వాల్‌‌కమ్ బిల్డింగ్‌‌ వద్దకు చేరుకున్నాడు. 

అక్కడ జనం గుమిగూడి ఉండడంతో అరుణ్‌‌కుమార్‌‌‌‌ ఘటనా స్థలానికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో అవినాశ్‌‌ డెడ్‌‌బాడీ కనిపించింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 8.30 గంటల సమయంలో అవినాశ్‌‌​ కంపెనీ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కాగా అవినాశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.