
- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఘటన
హుజూరాబాద్ రూరల్, వెలుగు : ‘నాకు ఈ జీవితం చాలు.. ఇక బతకాలని లేదు’ అని సూసైడ్ నోట్ రాసి ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గురువారం జరిగింది. మృతుడి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెరమాండ్ల రాజ్కుమార్ (38) జార్ఖండ్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేస్తున్నాడు. దసరా సెలవుల కోసమని ఇటీవల కాట్రపల్లి గ్రామానికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘నా చావు విషయాన్ని ఉన్నతాధికారులు, సహోద్యోగులకు తెలియజేయండి, నా చావుకు ఎవరూ కారణం కాదు, నేను బతకలేకపోతున్న.. ఈ నకరం భరించలేను.. నా కూతురిని, తల్లిదండ్రులను బాగా చూసుకోండి, నా కూతురు కాట్రపల్లిలో నా తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి, వాళ్ల అమ్మ వద్ద గానీ, అమ్మమ్మ వద్దగానీ ఉండకూడదు’ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. తండ్రి బిక్షపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.