న్యూఢిల్లీ: కరోనాతో పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, హెల్త్కేర్ వర్కర్లు ప్రాణాలు అడ్డుపెట్టి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కరోనాతో తోటోళ్లు చనిపోతున్నా భయపడేది లేదంటూ ముందుకొస్తున్నారు. కొందరికి వైరస్ సోకినా స్టాఫ్ ఎక్కువగా లేని ప్రాంతాల్లో డ్యూటీ చేసేందుకు వస్తున్నారు. మరికొందరు తమ ఫ్యామిలీకి సోకుతుందేమోనని ఇండ్లకెళ్లడం మానేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ డాక్టర్ను, నర్సును, మెడికల్ సిబ్బందిని కదిలించినా ఇదే చెబుతున్నారు. అయినా సరే జనం కోసం పని చేస్తామని, చేస్తూనే ఉంటామని వాళ్లు చెబుతున్నారు. అది తమ డ్యూటీ అంటున్నారు.
ఇది మా డ్యూటీ.. వస్తాం
వైరస్ ప్రభావం ఎక్కువున్న ఇటలీలో డజన్ల కొద్దీ డాక్టర్లు, నర్సులు చనిపోయారు. వేలల్లో హెల్త్ కేర్ సిబ్బంది ఇన్ఫెక్టయ్యారు. ఏడెనిమిది గంటల షిప్టులో పీపీఈ డ్రెస్ వేసుకోవడానికే 40 నుంచి 50 నిమిషాలు పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇక హ్యాండ్ వాషింగ్ కోసం రోజుకు గంట వరకు టైమ్ కేటాయిస్తున్నామన్నారు. ఈక్వెడార్లోని పసిఫిక్ పోర్ట్ సిటీ గయాక్విల్లో వైరస్ బారిన పడిన ఓ నర్సును వివరాలడగ్గా ఏడ్చేసింది. ఇప్పటికే ఆమె కొలీగ్స్ 80 మంది కరోనా బారిన పడ్డారు. ఐదుగురు చనిపోయారు. ఎలాంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకుండా ట్రీట్మెంట్ చేశామని అక్కడి ఓ నర్సు చెప్పారు. ‘తీవ్రమైన లక్షణాలు, బాధతో పేషెంట్లు వార్డుల్లోకి వస్తుంటే ట్రీట్మెంట్ చేయకుండా ఎలా ఉండగలం. అందుకే కిట్లు లేకుండానే చికిత్స చేయాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా తమకు సరైనన్ని పీపీఈ కిట్లు లేవని విమర్శించారు. న్యూయార్క్లో నర్సుగా పని చేసే బెన్నీ మాథ్యూ (43)కి పీపీఈ కిట్లు లేకుండానే ట్రీట్మెంట్ చేయడంతో వైరస్ వచ్చింది. ‘ఫీవర్ తగ్గిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది రమ్మని చెప్పారు’ అంతలా అవసరం ఉంది కాబట్టే పిలిచారని, కానీ తన తోటి సిబ్బందికి వైరస్ అంటిస్తానేమోనని భయంగా ఉందన్నారు బెన్నీ. పూర్తిగా కవర్ చేసుకొని ట్రీట్మెంట్కు వెళ్తున్నానని చెప్పారు.