చందానగర్, వెలుగు : డెయిలీ మద్యం తాగి వచ్చి తల్లిని, కుటుంబ సభ్యులను కొడుతూ వేధిస్తున్న తండ్రిని సెంట్రింగ్ చెక్కతో కొట్టి చంపాడో కొడుకు. ఈ ఘటన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాలపూర్ గ్రామానికి చెందిన వంగలి దస్తమ్మ, పెద్ద డేనియల్(60) కుటుంబంతో కలిసి 10 సంవత్సరాల కింద నగరానికి వచ్చి మియాపూర్ సుభాష్ చంద్రబోస్నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొద్దిరోజులుగా డేనియల్ ఒకరోజు కూలి పనికి వెళ్లి నాలుగు రోజులు ఇంట్లోనే ఉంటున్నాడు.
భార్యను కూడా పనికి వెళ్లనివ్వడం లేదు. పైగా డెయిలీ తాగొచ్చి భార్యను కొడుతున్నాడు. అడ్డు వచ్చిన కుటుంబసభ్యులను కూడా కొడుతూ తిడుతున్నాడు. ఈ నెల 24న ఉదయం భార్యను కూలి పనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో దస్తమ్మ తన పెద్ద కొడుకు ఖాసీంకు జరిగిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది. టీ షాప్ నిర్వహించే ఖాసీం వెంటనే ఇంటికి వచ్చి తల్లిని ఎందుకు కొడుతున్నావ్ అని నిలదీశాడు. డేనియాల్ కొడుకుపై దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. తండ్రితో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన ఖాసీం, అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో సెంట్రింగ్ చెక్కతో తండ్రి తలపై కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన డేనియల్ను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం 6 గంటలకు మియాపూర్ పోలీసులు నిందితుడు ఖాసీంను మియాపూర్ క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.