దారుణం.. ఉద్యోగం కోసం రోకలి బండతో కొట్టి.. తండ్రిని చంపిన కొడుకు

దారుణం.. ఉద్యోగం కోసం రోకలి బండతో కొట్టి.. తండ్రిని చంపిన కొడుకు

ఉద్యోగం కోసం కన్న తండ్రిని కడతేర్చాడు ఓ ఘాతకుడు. తండ్రి చేస్తున్న ఉద్యోగం తనకు రావాలంటే తండ్రి చనిపోవాలని భావించాడు. దీంతో రోకలి బండతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో బుధవారం (సెప్టెంబర్ 04) చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రామాచారి (58) ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య విరుపాక్షమ్మ. వీళ్లకు వీరస్వామి అనే ఒక కొడుకు, ఒక  కూతురు సంతానం. రామాచారి పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. 

డిగ్రీ వరకు చదివిన వీరస్వామి కొంతకాలం ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసిన అనంతరం గ్రామం చేరుకుని జులాయిగా తిరుగుతున్నాడు. తండ్రి రామాచారి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ ఉద్యోగం తనకిప్పించాలంటూ కొంతకాలంగా తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం తెలవారుజామున ఉద్యోగం విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుని రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. 

గమనించిన గ్రామస్తులు కోడుమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య విరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.