కర్ణాటకలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కన్నడ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందని..బీజేపీ దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల మంత్రులు కర్ణాటకలో ప్రచారం చేసినా..ప్రజలు కలిసికట్టుగా కాంగ్రెస్కే పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ మంచి ప్రదర్శన జనతా జనార్దన విజయమన్నారు. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇచ్చారని చెప్పారు. దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు.
కర్ణాటకలో గెలిచిన ఎమ్మెల్యేలందరిని మే 13వ తేదీ సాయంత్రం బెంగుళూరుకు రావాలని ఆదేశించామని..బెంగుళూరులో జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు..ముఖ్యమైన అంశాలపై చర్చిస్తామన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు మల్లికార్జున్ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు.