
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలకు నేడు తెరపడనుంది. ఇతర ఆఫీస్ బేరర్లను సంప్రదించిన తర్వాత లీగ్ ఫ్యూచర్పై అప్డేట్ ఇస్తానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ మొత్తం స్తంభించిపోవడం, ప్రాణాలను రక్షించుకునేందుకే ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో ఆటలు సాగడం కష్టమేనని సంకేతాలిచ్చాడు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో.. ఐపీఎల్ను ఏప్రిల్ 14 వరకు వాయిదా వేశారు.
అయితే రోజురోజుకు వైరస్ విజృంభిస్తుండటంతో.. చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగించాయి. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ను నిర్వహించడం కత్తిమీద సామే అవుతుంది. అయితే అక్టోబర్–నవంబర్ విండో కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్న బీసీసీఐ పెద్దలు మరోసారి వాయిదా ఆలోచన ఏమైనా చేస్తారా చూడాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక మొత్తానికే టోర్నీ రద్దయితే దాదాపు రూ. 3800 కోట్ల నష్టం వస్తుంది. మరి ఈ నష్టాన్ని బీసీసీఐ ఏ విధంగా భర్తీ చేసుకుంటుందనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.
నా జీవితంలో చూడలేదు..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా క్రైసిస్ను తన జీవితంలో ఎప్పు డూ చూడలేదని దాదా చెప్పాడు. ‘కొవిడ్తో జనం వణికిపోతున్నారు. నా 46 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియెన్స్ను చూ డలేదు. నేనే కాదు ప్రపంచం కూడా ఇలాంటి అనుభవాన్ని చూడలేదనుకుంటా. రాబోయే రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది చనిపోతారని చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నీ నమ్మశక్యంగా లేవు. లాక్డౌన్ కారణంగా నా కుటుంబంతో గడిపేందుకు సమయం దొరికింది. గతంలో చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని. బీసీసీఐ, ఐసీసీకి సంబంధించిన వర్క్ కూడా పూర్తి చేస్తున్నా. తర్వాత కాసేపు టీవీ చూడటం. జిమ్లో వర్కౌట్స్ చేయడం దినచర్యగా మారిపోయింది’ అని గంగూలీ వెల్లడించాడు.