బెంగళూరు: స్టార్ ఫుట్బాల్ సునీల్ ఛెత్రి మరోసారి మెరవడంతో.. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్షిప్లో ఇండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్–ఎ రెండో లీగ్ మ్యాచ్లో 2–0తో నేపాల్పై నెగ్గింది. దీంతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ 6 పాయింట్లు నెగ్గిన ఇండియా నాకౌట్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఇండియా తరఫున ఛెత్రి (61వ ని.), మహేశ్ సింగ్ (70వ ని.) గోల్స్ చేశారు. ఓవరాల్ కెరీర్లో 91 గోల్స్ (139 మ్యాచ్లు) కొట్టిన ఛెత్రి.. ఏషియాలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్గా రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నాడు. అలీ దాయి (ఇరాన్ 109 గోల్స్) ముందున్నాడు. మరో మ్యాచ్లో కువైట్ 4–0తో పాకిస్తాన్ను చిత్తు చేసి సెమీస్లోకి ప్రవేశించింది. ఈ నెల 27న ఇండియా, కువైట్ (6 పాయింట్లు) మధ్య జరిగే మ్యాచ్తో గ్రూప్–ఎ విన్నర్ ఎవరో తేలనుంది.
ఛెత్రి సూపర్..
ఛెత్రి, అనిరుధ్ తాపా, అబ్దుల్ సమద్ మినహా భారీ మార్పులతో బరిలోకి దిగిన ఇండియాకు నేపాల్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. కౌంటర్ అటాక్స్, బలమైన డిఫెన్స్తో తొలి హాఫ్ మొత్తం నేపాల్ ఎదురుదాడులకు దిగింది. అయితే సమయోచితంగా స్పందించిన టీమిండియా డిఫెన్స్ అంతే దీటుగా బదులివ్వడంతో గోల్స్ నమోదు కాలేదు. 21వ నిమిషంలో సమద్ కొట్టిన హెడర్ పక్కకు పోయింది. 34వ నిమిషంలో నేపాల్ ప్లేయర్ కొట్టిన షాట్ ఇండియా గోల్ పోస్ట్కు చేరువగా వెళ్లింది. 41వ నిమిషంలో మహేశ్ రైట్ ఫ్లాంక్ నుంచి కొట్టిన క్రాస్ షాట్ ఇన్సైడ్ బాక్స్లో నుంచి బయటకు వెళ్లింది. రెండో హాఫ్లో స్ట్రాటజీ మార్చిన ఇండియా చిన్న పాస్లతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో సమద్ అందించిన పాస్ను 61వ నిమిషంలో ఛెత్రి గోల్గా మలిచి ఇండియాకు 1–0 లీడ్ అందించాడు. చివరకు 70వ నిమిషంలో మహేశ్ కొట్టిన హెడ్ బాల్ ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి వెళ్లడంతో లీడ్ 2–0కు పెరిగింది. ఇక్కడి నుంచి నేపాల్ ఎదురుదాడి చేసినా ఇండియా డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది.