హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాల్లో.. అలాగే, మచిలీపట్నం రూట్లో ఆరు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.
ఇందులో 2 కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు నాందేడ్ – కాకినాడ రూట్లో, మిగిలిన రెండు మచిలీపట్నం – వికారాబాద్ మధ్య నడుస్తాయి. కాకినాడ – వికారాబాద్ రైలు (07450) జనవరి 19న కాకినాడ నుంచి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
వికారాబాద్– కాకినాడ రైలు (07451) జనవరి 20న వికారాబాద్ నుంచి ఉదయం 9 కు బయలుదేరి రాత్రి 9:15కు కాకినాడ చేరుకుంటుంది. నాందేడ్ – కాకినాడ రైలు (07452) జనవరి 12న మధ్యాహ్నం 1:30కు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9కు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07453) జనవరి 13న కాకినాడలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్కు చేరుకుంటుంది.
