దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు మరియు వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తప్పిపోయినట్లు సౌత్ కొరియా ప్రభుత్వం తెలిపింది.
దక్షిణ కొరియా అంతర్గత మరియు భద్రత మంత్రిత్వ శాఖ ప్రకారం, గురువారం (జులై 13) నుంచి కొండచరియలు విరిగిపడిన సంఘటనలలో ఏడుగురు మరణించగా 23 మంది గాయపడ్డారు. జూలై 9 నుంచి దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నందున దాదాపు 6వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. 27 వేల 260 ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం (జులై 15) నాటికి 4,200 మందికి పైగా సహాయక శిబిరాల్లో ఉన్నారు. చెయోంగ్జు నగరంలో వరదలు సోకిన సొరంగంలో చిక్కుకున్న 15 వాహనాల నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 400 మంది రెస్క్యూ వర్కర్లు తొమ్మిది మందిని రక్షించారు.
ఇలా ఉండగా, 20 విమానాలు రద్దు చేయబడ్డాయి. రైల్వే సేవలను నిలిపివేశారు. వాహనాల రాకపోకలు సాగించలేని రీతిలో దాదాపు 200 రోడ్లు మూసుకుపోయాయని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ( జులై 19) వరకు భారీ వర్షాలు కురుస్తాయని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ తెలిపింది. మధ్య ప్రాంతాలలో గోంజు మరియు చియోంగ్యాంగ్లలో 600 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.
