- ఎస్పీ రాజేశ్చంద్ర జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో పాత నేరస్థుల ఇండ్ల వద్ద తనిఖీ
కామారెడ్డి, వెలుగు : పాత నేరస్థులు సత్ప్రవర్తన కలిగి ఉండి, నేరాలకు దూరంగా ఉంటే రౌడీ షీట్లు తొలగిస్తామని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు ఏకకాలంలో పాత నేరస్థులు, అనుమానిత వ్యక్తుల ఇండ్ల వద్దకు వెళ్లి విస్తృత తనిఖీలు నిర్వహించారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఎస్పీ పర్యటించి పాత నేరస్థులు ఏం చేస్తున్నారంటూ ఆరా తీశారు.
మళ్లీ నేరాలకు పాల్పడకుండా చూడాలని అనుమానిత వ్యక్తుల తల్లిదండ్రులకు సూచించారు. రామేశ్వర్పల్లి, శాబ్దిపూర్ తండాల్లో తనిఖీలు నిర్వహించి స్థానికులకు పలు సూచనలు చేశారు. నేరాలకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించాలన్నారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
