గచ్చిబౌలి, వెలుగు: పర్యావరణ సమతుల్యతను కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో పిచ్చుకలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్మేనేజర్ కె. శిరీష తెలిపారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొండాపూర్ బోటానికల్ గార్డెన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీటకాల జనాభాను నియంత్రించడంతో పాటు పరాగసంపర్కం, విత్తనాల వ్యాప్తిలో ఈ చిన్ని పక్షులు కీలకమని వివరించారు. అనంతరం సందర్శకులు, వాకర్స్తో కలిసి పిచ్చుకల కోసం కృత్రిమ గూళ్లను తయారు చేయించారు.
మేడిపల్లి: ఉప్పల్ రేంజ్ పరిధిలోని మేడిపల్లి 2 ఆర్ఎఫ్లో పక్షుల దాహం తీర్చేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నీటి కుండలు, మేత తొట్టెలను పంపిణీ చేశారు. వేసవి కాలంలో పక్షులు నీటి కొరతతో ఇబ్బంది పడకుండా ఇండ్లు, చెట్లపై నీటి వసతి కల్పించాలని, పండ్ల చెట్లను విస్తృతంగా నాటడం ద్వారా వాటికి ఆశ్రయం కల్పించాలని అటవీ అధికారి వేణు మాధవరావు సూచించారు.
