
యోగాచరణను శ్రద్ధగా చేపట్టమని ఎవరైనా యువకుడిని ప్రోత్సహించినప్పుడు "యోగం నాకు ఎందుకు అంత ముఖ్యం?" అని అతడు అడగవచ్చు, అతని ప్రశ్నకు జ్ఞానపూర్వకంగా సమాధానం చెప్పాలంటే, మనకు ముందుగా సమాధానం తెలిసి ఉండాలి. ప్రతి సంవత్సరం, ఒక దశాబ్దం నుంచి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మన జీవితాలలో యోగాకు ఉన్న శాశ్వత ప్రాముఖ్యతను గుర్తించి ఉత్సవం జరుపుకోవడంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. అయినప్పటికీ, మనలో కొందరికి తెలిసినట్లుగా, యోగం యొక్క నిజమైన అర్థం దాని అంతరికమూ, మరియు లోతైన వ్యక్తిగత వ్యక్తీకరణలో ఉంది.
ప్రపంచంలోని అన్ని మతాలు నొక్కి వక్కాణించే దేవునితో ఏకత్వం కోసం మనం చేసే దివ్యమైన అన్వేషణను శాస్త్రీయ యోగ-ధ్యాన పద్ధతుల క్రమం తప్పని అభ్యాసం త్వరితం చేసి, అంతిమంగా సాధ్యం చేస్తుంది.శ్రద్ధాళువైన యోగి జీవితంలో అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే ఆధ్యాత్మిక సాధనా పద్ధతి క్రియాయోగం. శ్రీకృష్ణుడు తన శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలో క్రియాయోగం గురించి రెండుసార్లు ప్రస్తావించారు.
ఈ కీలకమైన, ఖచ్చితమైన విజ్ఞాన శాస్త్రాన్ని, శతాబ్దాల మానవ అజ్ఞానం తరువాత, పంతొమ్మిదవ శతాబ్దంలో, గొప్ప గురువైన లాహిరీ మహాశయులు, వారి గురుదేవులు మహావతార్ బాబాజీ ఆశీస్సులతో తిరిగి కనుగొన్నారు. ఆ తరువాత లాహిరీ మహాశయుల శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి లోతైన ఈ క్రియాయోగ విజ్ఞానాన్ని పరమహంస యోగానందకు అందించారు.యోగానంద, క్రియాయోగానికి ప్రపంచ రాయబారిగా బాధ్యతలు స్వీకరించి, దాని ప్రయోజనాలను పాశ్చాత్య ప్రపంచంలో విస్తృతంగా వ్యాప్తి చెందించారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు లక్షలాది మంది, క్రియాయోగ మార్గంలో అంతర్లీనమై ఉండే యోగ ధ్యాన శాస్త్రీయ పద్ధతులను అభ్యసిస్తున్నారు.
పరమహంస యోగానంద స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా క్రియాయోగ బోధనలతో లక్షలాదిమంది సాధకులు ప్రయోజనం పొందారు.ఈ ప్రపంచంలో సాధారణ ప్రజలు కూడా క్రియాయోగం వంటి శాస్త్రీయ పద్ధతిని శ్రద్ధగాను, భక్తితోను చేపట్టినప్పుడే జీవితాన్ని సార్థకం చేసే ప్రభావాన్ని అనుభవించగలరు.
మరింత సమాచారం కోసం: yssofindia.org