ప్రాణాలు తీసిన ఆట అభిమానం

ప్రాణాలు తీసిన ఆట అభిమానం

భారతదేశంలో క్రికెట్ అంటే ఇష్టపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. జాతీయ క్రీడ హాకీ కన్నా కూడా  క్రికెట్​నే  ఎక్కువగా అభిమానిస్తారు. ఇటీవల కాలంలో  ఆడ, మగ  తేడా లేకుండా అందరూ  క్రికెట్ చూస్తున్నారు. ప్రపంచంలో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల కన్నా క్రికెట్ ఆటగాళ్ల పేర్లునే టక్కున చెబుతుంటారు. ఏ స్టేడియంలో మ్యాచ్​ జరిగినా ఆటగాళ్లుకు ప్రేరణ ఇస్తారు. ఇది భారతీయులకు క్రికెట్​పై ఉన్న మక్కువ.  భారతీయులు ఎవరినైనా అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటారు. అందుకే మన సెలబ్రిటీలకు అంత క్రేజ్. కొందరు తమ ఫ్యామిలీ, కెరీర్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, యాక్టర్లు, నేతలకు ప్రాధాన్యమిస్తారు. వారికోసం ప్రాణాలైనా త్యాగం చేస్తారు. ఈ అభిమానమే వారి ప్రాణాల మీదకు తెస్తోంది. మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  విజేతగా నిలిచింది.  దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ విజయాన్ని బెంగళూరులో  ఫ్యాన్స్​తో చిన్నస్వామి స్టేడియంలో కర్నాటక క్రికెట్ సమాఖ్య విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలో  క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అంచనాకు మించి జనం రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది  మృతి  చెందారు. మృతి చెందిన 9 మంది 20 ఏళ్లలోపు యువతనే ఉండడం అందరినీ కలిచివేసింది. 

మనం అభిమానించే స్టార్ల మీద పిచ్చి ప్రేమతో విలువైన సమయం, ప్రాణాలు పోగొట్టుకోవడం శోచనీయం.  ప్లేయర్స్​పై అభిమానంతో ఇలాంటి భావోద్వేగ వాతావరణంలోకి ప్రవేశించిప్రమాదానికి  గురికావద్దు.మనం అభిమానించే స్టార్లు డబ్బులు సంపాదిస్తూ, క్రేజ్ పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు వెళ్తారు. కానీ,  వారి మీద పిచ్చి ప్రేమతో విలువైన సమయం, ప్రాణాలు పోగొట్టుకునేది మనమే. మన క్రీడాకారులకు, సినిమా హీరోలకు సామాజిక బాధ్యత కూడా లేదు. ఎందుకంటే వ్యాపార దృష్టితో అనేక రకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు. అవి ప్రాణానికి హాని కలిగించేవైనా వాటిని డబ్బుల కోసం ప్రచారం చేశారు. అవి పాన్​మసాలా, గుట్కా,  కూల్​డ్రింక్స్ వంటివి. అంటే ఆటగాళ్ల ఆటతోపాటు వారు చేసే ప్రకటనలతో కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికీ భారత్ దేశంలో పేద, బడుగు బలహీన వర్గాలు స్పోర్ట్స్​లో రాణించలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఆధిపత్య వర్గాలే రాణిస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలు వందల సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో,స్పోర్ట్స్ , వ్యాపారాల్లో  ఓడిపోతూ జీవిస్తున్నారు. ఇక నుంచి మన గెలుపునకు ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ నిర్వహణ లోపంతో తరచూ క్రీడా ప్రదేశాలు,  దర్శనీయ ప్రదేశాల దగ్గర తొక్కిసలాటలు జరిగి  ప్రజలు  ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి పట్ల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ ఆటగాళ్ల గెలుపు కోసం చివరికి మన జీవితాలను నాశనం చేసుకోవడం సరికాదు.


‌‌- సంపతి రమేష్ మహారాజ్