
- విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతం
- హైదరాబాద్ను ఒలింపిక్స్కు వేదికగా మారుస్తం: సీఎం
- స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యాబోధన ఉంటది.. ఫస్ట్ ప్రయారిటీ క్రీడలకే
- అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ
- ఈ వర్సిటీ పరిధిలోకే అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు
- నిపుణులైన కోచ్లతో స్టూడెంట్లకు ట్రైనింగ్
- దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ మారాలని ఆకాంక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక్కో స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ స్కూళ్లలో విద్యా బోధన కూడా ఉంటుందని.. అయితే, అందులో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు నచ్చిన ఆటల్లో ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీలో వసతి కల్పించి, మరింత పదును తేలేలా శిక్షణ అందజేస్తామని వివరించారు. దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సోమవారం సెక్రటేరియెట్లో ఉన్నతాధికారులతోసీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు యంగ్ ఇండియా పేరు
ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా యంగ్ ఇండియా పేరు ఖరారు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు కూడా యంగ్ ఇండియా పేరు పెడతామని వెల్లడించారు. యంగ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్రం బ్రాండ్గా మారాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శక్తిమంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
వర్సిటీ ఏవిధంగా ఉండాలనే దానిలో పలు సూచనలు చేశారు. చిన్నతనంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలు, వారికి ఏ క్రీడలపై మక్కువ ఉందో టీచర్లు గుర్తించాలని సీఎం అన్నారు. అటువంటి విద్యార్థులందరికీ ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఒలింపిక్స్కు వేదికగా మార్చాలి
హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలని.. అన్ని రకాల క్రీడలను, క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గొడుగు కిందికి తేవడమే స్పోర్ట్స్ వర్సిటీ లక్ష్యమని సీఎం రేవంత్ వెల్లడించారు. మన దేశంతో పాటు తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు, మన శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలు ఏవో గుర్తించి, క్రీడలపై ఉత్సాహం ఉన్న వాళ్లను గుర్తించి, వాళ్లను ఆయా క్రీడల్లో ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఏండ్ల కిందట్నే ఆఫ్రో- ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ను భవిష్యత్తులో ఒలింపిక్స్కు వేదికగా మార్చాలని సూచించారు. హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా ప్రతి క్రీడలో మన క్రీడాకారులకు పతకాలు దక్కేలా వారిని తీర్చిదిద్దాలని, అందులో మన స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాకారులు కచ్చితంగా ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. ఇందుకోసం వారికి నిపుణులైన కోచ్ లతో ట్రైనింగ్ ఇప్పించాలన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో...
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, క్రీడా శిక్షణ సంస్థలు అన్నింటిని స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన దేశ క్రీడాకారులు ఒలింపిక్స్లో రాణించేలా షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఆయన చెప్పారు.