శ్రీలంక ప్రధాని ఇంటిని ముట్టడించిన స్టూడెంట్లు

శ్రీలంక ప్రధాని ఇంటిని ముట్టడించిన స్టూడెంట్లు

కొలంబో: శ్రీలంకలో నెలల తరబడిగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంపై ఆగ్రహం చెందిన వేలాది మంది శ్రీలంకన్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం ప్రధాని మహీంద రాజపక్స ఇంటిని చుట్టు ముట్టడానికి ప్రయత్నించారు. దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, చమురు కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో గత కొన్ని వారాలుగా ఆ దేశంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం విద్యార్థుల చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాజపక్స నివసించే ఇంటి కాంపౌండ్ ను ముట్టడించడానికి ప్రయత్నించారు. కొంత మంది విద్యార్థి నాయకులు ఫెన్సింగ్ దాటుకొని కాంపౌండ్ లోనికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొలంబోలో పలు చోట్లు బారికేడ్లు ఎర్పాటు చేసి ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే విద్యార్థులు బారికేడ్లను తొలగిస్తుండగా, పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది. 'మీరు రోడ్లు బ్లాక్ చేసి మమ్మల్ని ఆపగలరేమో.. కానీ, ఈ ప్రభుత్వం మొత్తం ఇంటికి వెళ్లే వరకు మా ఉద్యమాన్ని మాత్రం ఆపలేరు' అని విద్యార్థి నాయకుడు ఒకరు చెప్పారు. 'గో హోమ్ గొట' అని ప్లకార్డులు పట్టుకొని అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్న సమయంలో ప్రధాని మహీంద ఇంట్లో లేడని తెలయడంతో వాళ్లు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయారు.