వలసబాట పట్టిన శ్రీలంక వాసులు

వలసబాట పట్టిన శ్రీలంక వాసులు

కొలంబో: శ్రీలంకలో పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి తిండి లేదు.. వండుకుందామంటే గ్యాస్​లేదు. ఎట్లయినా గ్యాస్​ దొరికిందనుకుంటే.. సామాన్లు కొందామంటే డబ్బుల్లేవు.. గ్రాసరీ ధరలు కూడా మస్తు పెరిగినయ్​.. దీంతో జనాలు అక్కడ ఉండలేకపోతున్నారు. చాలా మంది శ్రీలంకన్​లు ఇమ్మిగ్రేషన్​ డిపార్ట్​మెంట్ ​హెడ్​క్వార్టర్, ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాస్​పోర్టు దొరికితే ఏ దేశానికైనా వెళ్లి బతుకుదామని చూస్తున్నారు. పని చేద్దామంటే ఇచ్చేవాళ్లు దిక్కులేకపాయె. పని దొరికినా ఒక పూట కడుపు నింపుకునే కూలి పైసలు కూడా ఇస్తలేరని చెబుతున్నారు. ఇక్కడుండి ఏం చేయలేం అని డిసైడ్​అయ్యారు. చాలా మంది శ్రీలంక వదిలి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నారు. లేబర్లు, షాప్​ఓనర్లు, రైతులు, పబ్లిక్​ సర్వెంట్లు, హౌస్​ వైఫ్స్​ఇలా చాలా మంది పాస్​పోర్టుల కోసం రోజుల కొద్దీ క్యూలైన్లో నిల్చుని ఎదురుచూస్తున్నారు. 70 ఏండ్ల కాలంలో ఇలాంటి గోస పడలేదని, ఇగ ఇక్కడ బతకడం కష్టమని, వేరే దేశానికి వెళ్లిపోతున్నామని బాధతో చెబుతున్నారు. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 2,88,645 పాస్​పోర్టులు జారీ చేయగా.. గతేడాది ఇదే కాలంలో 91,331 పాస్​పోర్టులే ఇచ్చినట్టు సర్కార్​ లెక్కలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా 22 మిలియన్​ల ప్రజలు ఫుడ్​, కుకింగ్​ గ్యాస్​, ఫ్యూయెల్​, మెడిసిన్స్​ కోసం ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మైగ్రెంట్స్​గా వెళ్లిపోతున్నారు. కట్టుబట్టలతో ఇండ్లు వదిలేసి వలస పోతున్నారు.  ఇక పాస్​పోర్టు ఆఫీసుల్లోని సిబ్బందికి పని ఎక్కువైంది. రాత్రిళ్లు కూడా ఆఫీస్​లోనే ఉండి పని చేస్తున్నారు. రోజుకు 3,000 మంది పాస్​పోర్టుల కోసం అప్లికేషన్లు ఇస్తున్నారు. అయితే, ఇంకొన్ని నెలలు ఫుడ్​ క్రైసిస్​ ఉంటుందని ప్రధాని విక్రమ సింఘే చేసిన ప్రకటనతో వలసలు మరిన్ని పెరిగాయని అధికారులు చెబుతున్నారు.