రామనామస్మరణతో మార్మోగిన హైదరాబాద్‌‌ వీధులు

రామనామస్మరణతో మార్మోగిన హైదరాబాద్‌‌ వీధులు

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌లో శ్రీరామనవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. అన్ని ఆలయాల్లో రాములోరి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. దూల్‌‌పేట్‌‌ సీతారాంబాగ్‌‌లోని సీతారామ ఆలయం నుంచి ధూల్​పేట, పురాణాపూల్​, బేగంబజార్, పుత్లిబౌలి మీదుగా కోఠిలోని సుల్తాన్​బజార్​దాకా 7 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభాయాత్ర సాగింది. జైశ్రీరాం నినాదాల నడుమ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. యాత్రకు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్​లోని ఆలయాలు, శోభాయాత్ర జరిగిన ప్రాంతాలన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి. సీతారాంబాగ్‌‌ ఆలయంలో అసెంబ్లీ స్పీకర్‌‌‌‌  గడ్డం ప్రసాద్‌‌, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, గోషామహల్‌‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.