భూతల స్వర్గం కశ్మీర్ (Kashmir )కు మరో అందం శ్రీనగర్ (Srinagar)లో ఉన్న ఇందిరా గాంధీ స్మారక తులిప్ గార్డెన్ ( Indira Gandhi Memorial Tulip Garden). తాజాగా ఈ గార్డెన్ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records)లో చోటు దక్కించుకుంది.
జమ్ము కాశ్మీర్లోని ప్రముఖ ఇందిరాగాంధీ స్మారక తులిప్ గార్డెన్కు అరుదైన గుర్తింపు లభించింది. ఆసియాలోనే అతి పెద్ద గార్డెన్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో చోటు దక్కించుకుంది. 68 రకాలతో దాదాపు 1.5 మిలియన్ల తులిప్ పుష్పాలతో ఉండే గార్డెన్ అరుదైన ఘనత సాధించినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్(ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
తులిప్ గార్డెన్ శ్రీనగర్లోని దాల్ సరస్సు, జబర్వాన్ పర్వత ష్రేణుల దిగువన దాదాపు 30 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా తులిప్ గార్డెన్స్ ఉన్నప్పటికీ ఆసియాలో ఇదే అతి పెద్దది.ఈ గా ర్డెన్లోని తులిప్ పుష్పాలను చూసేందుకు ఏటా లక్షల మంది పర్యటకులు వస్తుంటారు. కశ్మీర్లో పర్యాటకాన్ని, ఫ్లోరికల్చర్ను అభివృద్ధి చేసేందుకు 2007లో ఈ పార్క్ను ప్రారంభించారు. ఇక్కడ ఏటా వసంత రుతువు సమయంలో తులిప్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహిస్తుంటారు. రకరకాల రంగుల్లో, వెరైటీలలో తులిప్ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్ అండ్ పార్క్స్ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షుడు సంతోష్ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ దిలీప్ ఎన్ పండిత్, కశ్మీర్ అధికారులు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ గొప్పతనాన్ని గుర్తించినందుకు వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ బృందానికి కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా వర్ణించారు.
కాశ్మీర్లో పూల సంపద.. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. శ్రీనగర్లోని ప్రకృతి అందాలకు కేరాఫ్గా ఉంటుంది ఈ తులిప్ తోట. ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు శ్రీనగర్కు తరలివస్తుంటారు.శ్రీనగర్ ప్రకృతి అందాలకు కేరాఫ్గా ఉంటుంది. నగర సోయగం అక్కడ విరిసే పూలల్లో దాగి ఉంటుంది. రంగురంగుల పూలు ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, రంగుల తివాచీగా మారినట్లు ప్రకృతి అందాలకు కేరాఫ్గా ఉంటుంది తులిప్ తోట.. శ్రీనగర్ టూరిజం కశ్మీర్ లోయలో పూల పెంపకం, పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ఈ పార్క్ను 2007లో ప్రారంభించారు.