
జీడిమెట్ల, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న కార్మికుల కష్టాలు చూసిన తర్వాత వారికి అండగా ఉండేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క హమీని నెరవేర్చలేదన్నారు.
కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. నిజాంపేట పరిధి బాచుపల్లిలోని నందనవనం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైలంగౌడ్కు మద్దతుగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు, చీకోటి ప్రవీణ్, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నిజాంపేట పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు.