బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన నటుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ‘50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్ టైమ్’ పేరుతో ‘ఎంపైర్ మ్యాగజైన్’ విడుదల చేసిన జాబితాలో హాలీవుడ్ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాలకు చోటు దక్కగా... భారత్ తరపు నుంచి షారుఖ్ ఖాన్ కు ఈ ఘనత దక్కడం విశేషం.
ఎంపైర్ మ్యాగజైన్ లో టాప్ 50 నటుల సరసన షారుఖ్ ఖాన్ నిలిచిన విషయాన్ని ఆయన మేనేజర్ పూజా దద్లానీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దేశాన్ని గర్వపడేలా చేయగల ఒకే ఒక భారతీయుడు అంటూ షారుఖ్ ను కొనియాడారు. ఇక 1992లో ‘దీవానా’ చిత్రంలో అరంగేట్రం చేసిన షారుఖ్.. తన కెరీర్లో దిల్ వాలే దుల్హానియా, చక్ దే ఇండియా లాంటి ఎన్నో చిత్రాలలో ఉత్తమమైన నటన ప్రదర్శించి పాపులర్ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను అనేక అవార్డులు అందుకున్నారు. ఇక షారుఖ్ రాబోయే సినిమా విషయానికొస్తే.. ‘పఠాన్’, ‘జవాన్’ ‘ఢుంకీ’ ఉన్నాయి. ‘పఠాన్’ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. జవాన్ జూన్ 2న, ఢుంకీ వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.