రాజీవ్ రహదారి విస్తరణపై  సర్కారు ఫోకస్..పెరుగుతున్న ట్రాఫిక్​తో వాహనదారులకు ఇబ్బందులు

రాజీవ్ రహదారి విస్తరణపై  సర్కారు ఫోకస్..పెరుగుతున్న ట్రాఫిక్​తో వాహనదారులకు ఇబ్బందులు
  • రోజూ 40 వేల వెహికల్స్ ప్రయాణం
  • 2039తో ముగియనున్న కాంట్రాక్ట్ గడువు
  • కంపెనీకి పరిహారం ఇచ్చి హైవేను స్వాధీనం చేసుకునే యోచనలో సర్కార్
  • నేషనల్ హైవే కింద 6 లేన్లుగా మార్చేలా ప్రణాళికలు
  • 3 అలైన్​మెంట్లు రెడీ చేసినఆర్ అండ్ బీ
  • సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కేంద్రానికి ప్రపోజల్స్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా రామగుండం వెళ్లే రాజీవ్ రహదారి విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్, సరిపడా బైపాస్​లు  లేకపోవడంతో హైవేపై యాక్సిడెంట్లు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లాలంటే ఈ రహదారి ఎంతో కీలకం. ఈ హైవేపై రోజుకు 40వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రహదారి విస్తరణపై ఫోకస్ పెట్టారు. దీన్ని నేషనల్ హైవే కిందికి తీసుకొచ్చి ఆరు లేన్ల రహదారిగా మార్చాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది.

25 ఏండ్లు టోల్ వసూలు చేసుకునేలా అగ్రిమెంట్

ఔటర్ రింగ్ రోడ్ శామీర్ పేట నుంచి రామగుండం వరకు మొత్తం 207 కిలో మీటర్లు ఉంటాయి. ఈ రోడ్డును గాయత్రి ప్రాజెక్ట్ కంపెనీ రూ.1,400 కోట్లతో డీబీఎఫ్ వోటీ (డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్) పద్ధతిలో నిర్మించింది. మొత్తం 25 ఏండ్లు టోల్ వసూలు చేసుకునేలా ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నది. 2014 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. 2039తో అగ్రిమెంట్ గడువు ముగియనున్నది. హెచ్​కేఆర్ (హైదరాబాద్–కరీంనగర్–రామగుండం) రోడ్ వేస్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేస్తున్నారు. ఈ హైవేపై దుద్దెడ, రేణికుంట, బసంత్ నగర్ దగ్గర 3 టోల్ ప్లాజాలు ఉన్నాయి.

హైవే నిర్మాణ సమయంలో బైపాస్ రోడ్లు, అండర్ పాస్ లు నిర్మించకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుద్దెడ, ప్రజ్ఞాపూర్, కుకునూర్ పల్లి దగ్గర బైపాస్ రోడ్లు నిర్మించింది. ఈ కంపెనీ నుంచి హైవేను స్వాధీనం చేసుకోవాలనే ప్రపోజల్ ను గత కొన్నేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి. 2039 వరకు అగ్రిమెంట్ ఉన్నందున అప్పటి వరకు వసూలయ్యే టోల్​ను అంచనా వేసి గాయత్రి కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సుమారు రూ.1,000 నుంచి రూ.1,200 కోట్ల వరకు కంపెనీకి చెల్లించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’కు తెలిపారు.

కసరత్తు చేస్తున్న అధికారులు

రాజీవ్ రహదారి విస్తరణపై ఆర్అండ్ బీ, నేషనల్ హైవే అధికారులు కలిసి 3 అలైన్​మెంట్లు రెడీ చేశారు. ప్రస్తుతం ఉన్న రోడ్​ను విస్తరించడంతో పాటు, శామీర్ పేట దాటిన తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుంచి రామగుండం వరకు, యాదాద్రి వైపు నుంచి మరో అలైన్ మెంట్ రెడీ చేశారు. ఈ 3 మార్గాల్లో హైవే విస్తరణకు అవసరమైన భూమి, నిధులు, వచ్చే 25, 30 ఏండ్లలో పెరిగే ట్రాఫిక్, ఈ రూట్లలో ఫారెస్ట్, రైల్వే ట్రాక్​లు, రిజర్వాయర్లు, నిర్మించాల్సిన బ్రిడ్జీలు, అండర్ పాస్ లు, బైపాస్ లు ఇలా అన్ని వివరాలతో రిపోర్ట్ రెడీ చేసి సీఎంకు ఇటీవల ఆర్ అండ్ బీ అధికారులు అందజేశారు. ఈ 3 ప్రపోజల్స్ లో ఒక రూట్ ను సీఎం ప్రాథమికంగా ఫైనల్ చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆర్ అండ్ బీ ఆఫీసర్లు మరింత కసరత్తు చేస్తున్నారు.

గడ్కరీని కలిసి విన్నవించిన పొన్నం

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. రాజీవ్ రహదారిని 8 లైన్లకు విస్తరించాలని కోరారు. లక్షల మంది ప్యాసింజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ మేరకు గడ్కరీకి పొన్నం లేఖ అందజేశారు. ట్రాఫిక్ పెరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. కాగా, సీఎం ఫైనల్ చేసిన అలైన్​మెంట్ ను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ పంపనున్నది. అనంతరం డీపీఆర్ తయారీ బాధ్యతలను ఎన్ హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా)కి అప్పగించనున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ద్వారా ఈ రూట్ విస్తరణ అంశంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఆయన కూడా ఈ రూట్ విస్తరణపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.