
- రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా నర్మెటలోని ఆయిల్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అక్కడకు వెళ్లి రాజకీయం చేయడం తగదని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు హరీశ్ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఫ్యాక్టరీ వద్దకు హరీశ్ వెళ్లి రాజకీయం చేయడం ఏమిటని మండిపడ్డారు. 2023 డిసెంబర్ వరకు అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాలేదని, బీఆర్ఎస్ సర్కార్ శంకుస్థాపన చేసి వదిలేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పామాయిల్ పంటను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీని నిర్మించి వినియోగంలోకి తెచ్చామన్నారు.