
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వితంతువులకు అండగా ఉంటూ, వారికి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన వితంతువుల దినోత్సవంలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వితంతువులు సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కును కమిషన్ కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 43,703 మంది వితంతువులు ఉన్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని తెలిపారు.
జిల్లాలో మొదటిసారి మహిళ సంరక్షణ, హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. వితంతువులను చిన్నచూపు చూడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భర్తను కోల్పోయాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వారి ప్రాథమిక హక్కులు, అవసరాలు, బాధలు, అనుభవాలపై దృష్టి సారించాలన్నారు. వితంతువులు, వారిపై ఆధారపడిన వారు ఎదుర్కొంటున్న సవాళ్లను, పేదరికం, హింస, వివక్షతను రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వారికి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎంకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు పి అమరేందర్, దేవ సహాయం, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ, స్వరూప, రాజేశ్వరి, డీఆర్డీవో చిన్న ఓబులేషు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, సఖి కో ఆర్డినేటర్ సునీత పాల్గొన్నారు.