సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

సింగరేణి వేలాన్ని ఆపండి: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 

న్యూఢిల్లీ: సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లోక్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కల్యాణ్ గని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణిపల్లి కోల్ బ్లాక్స్ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ చెప్పారని లోక్ సభ దృష్టికి తెచ్చారు.

ఇచ్చిన హామీని విస్మరిస్తూ  కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరంగా చేసే దిశగా అడుగులు వేస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించగా..  కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు.  సిస్టమ్ ప్రకారమే కోల్ మైన్స్ వేలం జరుగుతుందన్నారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతమేనని..అలాంటప్పుడు ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి  ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. 

సింగరేణి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కంపెనీ: ఎంపీ రంజిత్ రెడ్డి

సింగరేణి సౌత్ ఇండియాలో అతిపెద్ద కంపెనీ అని ఎంపీ రంజిత్ రెడ్డితెలిపారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని చెప్పారు. సింగరేణిలో రాష్ట్రప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని వివరించారు. 

సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని గతంలో సీఎం కేసీఆర్ లేఖ రాశారని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు.  సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేస్తూ.. మోడీ ఇచ్చిన హామీని విస్మరిస్తూ ఇప్పుడు నాలుగు బ్లాకులు ప్రైవేటు పరం చేస్తామంటున్నారని తెలిపారు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా 38 బ్లాక్లు అమ్ముతున్నారని తెలిపారు. సింగరేణిని తెలంగాణ రాష్ట్రానికి వదిలేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు.