- శుద్ధి చేసిన నీటిని మూసీలో వదలకుండా నాన్ డ్రింకింగ్ ప్రయోజనాలకు వాడకం
- కేంద్రానికి వాటర్ బోర్డు ప్రతిపాదనలు
- రూ.169 కోట్లతో అప్గ్రేడేషన్ పనులు
- జల్ హీ అమృత్ కింద ఇన్సెంటివ్స్ ఇవ్వనున్న కేంద్రం
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎస్టీపీలను అప్ గ్రేడ్ చేసేందుకు వాటర్బోర్డు ప్లాన్లు రూపొందించింది. కేంద్ర సర్కారు ఇటీవల నగరానికి వాటర్ప్లస్అవార్డు ప్రకటించింది. ఇందులో భాగంగా జల్ హీ అమృత్ స్కీం కింద రూ.169 కోట్ల ఇన్సెంటివ్స్ఇవ్వనుంది. దీంతో వాటర్బోర్డు ఆ నిధులతో సిటీలోని 18ఎస్టీపీల అప్గ్రేడ్చేయనున్నామంటూ ప్రతిపాదనలు రెడీ చేసి కేంద్రానికి పంపించింది.
ఎక్కడెక్కడి ఎస్టీపీలంటే..
ప్రాజెక్టులో భాగంగా నాగోల్ లో 320 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న ఎస్టీపీని రూ. 3.83 కోట్లతో, నాగోల్లోని 172ఎంఎల్డీల మరో ఎస్టీపీని 2.48 కోట్లతో, అత్తాపూర్లో 51 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న ఎస్టీపీని 1.66 కోట్లతో, లింగంకుంటలోని 30 ఎంఎల్డీ ఎస్టీపీని, గోపన్నపల్లిలోని 4.5 ఎంఎల్డీ ఎస్టీపీని రూ. 1.23 కోట్లతో, మీరాలంలోని 10 ఎంఎల్డీ ఎస్టీపీని రూ.83 లక్షలతో, ఇక్కడే ఉన్న మరో 5 ఎంఎల్డీ ఎస్టీపీ రూ. 62 లక్షలతో నల్లచెరువులోని 30 ఎంఎల్డీ ఎస్టీపీని రూ. 82.24 లక్షలతో, ఖాజాకుంట 12ఎంఎల్డీ ఎస్టీపీని 82.24 లక్షలతో, సఫిల్గూడలోని 0.6 ఎంఎల్డీ ప్లాంట్ను 20.20 లక్షలతో, ఎన్ఎం కుంటలోని 4ఎంఎల్డీ ఎస్టీపీని 20.19 లక్షలతో, లంగర్హౌజ్ లోని 1.2 ఎంఎల్డీ ఎస్టీపీని 19.35 లక్షలతో, దుర్గం చెరువును 5ఎంఎల్డీ ఎస్టీపీని 1.65 కోట్లతో, ఖాజాగూడలోని 7 ఎంఎల్డీ, నానక్రామ్గూడ 4.5 ఎంఎల్డీ ఎస్టీపీని రూ. 14.48 కోట్లతోనూ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
శుద్ధి చేసిన నీటి వినియోగం ఇలా..
కేంద్రం ఇచ్చే నిధులతో ఆయా ట్రీట్మెంట్ప్లాంట్లలో ప్రస్తుతం ఉన్న నీటి శుద్ధి మెషీన్లను (ఎరేషన్ సిస్టమ్)ను మార్చి కొత్త వాటిని బిగిస్తారు. గ్రిడ్లైన్లను మారుస్తారు. నీటి క్వాలిటీని నిరంతరం మానిటర్చేసే పరికాలను అమరుస్తారు. ఇంటర్నేషనల్స్టాండర్డ్స్కు అనుగుణంగా మురుగునీటి శుద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటారు.
ప్రస్తుతం మూసీ వెంట ఉన్న ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని తిరిగి మూసీలోకే వదులుతున్నారు. కానీ, ఎస్టీపీల అప్గ్రేడేషన్తర్వాత శుద్ధి చేసిన కొంత నీటిని మూసీలోకి వదిలి మరి కొంత నీటిని రిజర్వాయర్లలో నిల్వ చేసేలా ప్లాన్లు రూపొందిస్తున్నారు.
ఈ నీటిని తాగడానికి కాకుండా గార్డెనింగ్, క్లీనింగ్, భవన నిర్మాణాలకు వాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విషయమై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్బోర్డు సరఫరా చేస్తున్న తాగునీటినే కొందరు భవన నిర్మాణాలకు, చెట్లకు పోసేందుకు ఉపయోగిస్తున్నారు. దీంతో చాలా నీరు వృథా పోతోంది. కానీ, ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని ఆయా అవసరాలకు సరఫరా చేస్తే సమస్య తగ్గుతుందంటున్నారు.
