మాయమాటలు చెప్పి చిన్నారిని ఎత్తుకెళ్లాడు

మాయమాటలు చెప్పి చిన్నారిని ఎత్తుకెళ్లాడు

రాంగోపాల్ పేట పీఎస్ లో తండ్రి కంప్లయింట్

అబిడ్స్, వెలుగు: జ్వరం వచ్చిన కూతురిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో మాయమాటలతో తన దృష్టి మరల్చి గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడంటూ ఓ తండ్రి రాంగోపాల్ పేట పోలీసులకు కంప్లయింట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..యాప్రాల్ లో ఉండే రాజు,హాజీరా దంపతుల సంతానం ఫాతిమా(5)కి సోమవారం జ్వరం వచ్చింది. కూతురిని తీసుకుని భార్య హాజీరాతో కలిసి రాజు నిలోఫర్ హాస్పిటల్ కి వెళ్లాడు. అక్కడ కూతురిని డాక్టర్ కి చూపించాడు. తర్వాత రాజు కూతురు, భార్యతో కలిసి సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద దిగి జేమ్స్ స్ట్రీట్ రైల్వేస్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో కాగితాలు  ఏరుకునే ఓ వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి మాటలు కలిపాడు. మీ పాప బాగుందని కాసేపు ఎత్తుకుంటానన్నాడు. దీంతో రాజు ఫాతిమాను ఆ వ్యక్తికి ఇచ్చాడు. తర్వాత పాలు తీసుకొస్తామని చెప్పి ఫాతిమాను అతడి దగ్గరే ఉంచి ఉంచి రాజు,హాజీరా వెళ్లారు. పాలు తీసుకొచ్చేలోగా ఆ కాగితాలు ఏరుకునే వ్యక్తి రాజు కూతురిని ఎత్తుకెళ్లాడు. దీంతో రాజు రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.