- గ్రేటర్ వరంగల్, ఖమ్మం, వేములవాడ, ధర్మపురి, సైబరాబాద్ ప్రాంతాలను ఎంపిక చేసిన కేంద్రం
- స్టాల్స్, టూరిజం లొకేషన్స్, లోకల్ ఫుడ్ వివరాలు పంపిన ఆఫీసర్లు
- వచ్చే వారం పట్టణాల్లో పర్యటించనున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆఫీసర్లు
వరంగల్, వెలుగు : ఢిల్లీ, గుజరాత్, ముంబై, ఇండోర్, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో నడుస్తున్న స్ట్రీట్ ఫుడ్ హబ్స్ త్వరలోనే తెలంగాణలో కూడా ప్రారంభం కానున్నాయి. ఈ హబ్స్ ఏర్పాటుకు రాష్ట్రంలోని ఐదు పట్టణాలను ఎంపిక చేశారు. ఈ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే క్రమంలో వారికి లోకల్ ఫుడ్ను అందుబాటులో తీసుకురావడంతో పాటు చిరు వ్యాపారాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ హబ్స్ను ప్రారంభిస్తున్నారు.
రాష్ట్రం నుంచి ఐదు పట్టణాలు...
స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటుకు ఎంపికైన పట్టణాల్లోని సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు ఇవ్వనుంది. రాష్ట్రం నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి, ములుగు జిల్లా మేడారం, సైబారాబాద్ పరిధిలోని కూకట్పల్లి నల్లచెరువు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని భద్రకాళి బండ్, జగిత్యాల జిల్లా ధర్మపురి (ఐవీఎన్ఎంసీ, చింతామణి చెరువు రోడ్), ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్, సిరిసిల్ల జిల్లా వేములవాడ (గుడి చెరువు టెంపుల్ ఏరియా), సిద్దిపేటలోని కోమటి చెరువు, హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు ట్యాంక్బండ్ ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ పెట్టేందుకు ప్రపోజల్స్ పంపించారు. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం, వేములవాడ, ధర్మపురి, సైబారాబాద్ ఏరియాలను కేంద్రం ఎంపిక చేసింది. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి స్ట్రీట్ ఫుడ్ అందించే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. స్ట్రీట్ ఫుడ్ హబ్స్ కోసం ఎంపిక చేసిన పట్టణాల్లో వచ్చే వారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆఫీసర్లు పర్యటించనున్నారు.
తెలంగాణ రుచులకు ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో ఏర్పాటయ్యే స్ట్రీట్ ఫుడ్ హబ్స్లో తెలంగాణ రుచులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెలంగాణ పిండి వంటలైన సకినాలు, గారెలు, సర్వపిండి, జొన్నెరొట్టెతో పాటు హైదరాబాద్ ధమ్ బిర్యానీకి ఎంతో పేరుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక వంటలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో తెలంగాణ రుచులు ప్రత్యేక గుర్తింపు రానుంది.
వరంగల్ భద్రకాళి బండ్లో 50 స్టాల్స్
కేంద్ర ప్రభుత్వ స్ట్రీట్ ఫుడ్ హబ్ లిస్ట్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికైన నేపథ్యంలో స్టాల్స్ ఏర్పాటుకు భద్రకాళి బండ్ను ఎంపిక చేశారు. ట్రై సిటీ జనాలకు అందుబాటులో ఉండి రోజూ దాదాపుగా 1500 నుంచి 2 వేల మంది పర్యాటకులు రావడానికి తోడు ఇక్కడ 400 మంది కూర్చునేందుకు వీలు ఉండడంతో ఈ ప్లేస్ను సెలెక్ట్ చేశారు. భద్రకాళి బండ్ వద్ద అద్భుతమైన లేక్ వ్యూ, ఫొటో స్పాట్స్, లైటింగ్ సౌకర్యం ఉంది. 100 కార్లు, 300 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా కావాల్సిన డ్రైనేజీ వ్యవస్థ, రెస్ట్ రూంలు, మంచినీటి, విద్యుత్ సౌకర్యం ఉంది.
భద్రకాళి బండ్ వద్ద ఏర్పాటు చేసే స్ట్రీట్ ఫుడ్ హబ్ స్టాల్స్ను ఆహార ఉత్పత్తి, బ్రాండింగ్, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రత్యేక శిక్షణ ముగించుకున్న మహిళా స్వయం ఉపాధి సంఘాలకు అందించాలన్న ఆలోచనలో ఉన్నారు. భద్రకాళి బండ్ వద్ద ఏర్పాటు చేసే స్టాల్స్లో ధమ్ బిర్యానీతో పాటు సకినాలు, గారెలు, సర్వపిండి, పల్లీలు, నువ్వులతో చేసే పొడులు, ఇప్ప పువ్వు, పల్లీ, బెల్లం నువ్వుల లడ్డూలు, సీజనల్ పండ్ల రసాలు, జొన్నరొట్టె, మిర్చి, బజ్జీల వంటి లోకల్ ఫుడ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
