
హైదరాబాద్, వెలుగు: ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్, ఇంద్రజిత్ గుప్తా హాల్ లో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ప్రముఖ కమ్యూనిస్టు నేత శాకమూరి సుగుణమ్మ సంస్మరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. సుగుణమ్మ మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదర్శవంతమైన జీవితం గడిపిన సుగుణమ్మ పోరాట యోధురాలని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలవాలని ప్రజలు బలంగా కోరుతున్నారని, సుగుణమ్మ కోరిక కూడా అదేనని చెప్పారు. సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.