
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీ వెల్లడించారు. 73 వేల 414 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరాలను వెల్లడించారు. అలాగే 7వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహి స్తున్నా మని, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 173 అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.186 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ సీజ్ చేశామని వెల్లడించారు. 8 వేల 863 కేసులు నమోదు చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రబలగాలతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు .. సోషల్ మీడియాలో ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దుల్లో పారామెలిటీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.